Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరిగ్గా మూడేండ్ల క్రితం మన నుంచి భౌతికంగా సి.వి. (చిత్తజల్లు వరహాలరావు) దూరమైన వారంలోగా ప్రజాశక్తి బుకహేౌస్ వారు 'మన తరం ప్రజాస్వరం'గా ఆయనపై ఒక గొప్ప జ్ఞాపికను (15-11-2017 నాడు) వెలువ రించారు. ఆయన రచన లన్నిటినీ 24సంపుటాలుగా ఒకేరోజు (2015 జూన్ )న ఆవిష్కరించటమే కాక ఒక అపూర్వ పౌర సన్మానాన్ని సాహిత్య, సాంస్కతిక, సామాజిక సంస్థలు అనేకం కలిసి విజయవాడలో నేను కన్వీనర్గా నిర్వహించాం. ఆ రోజుని 'నిప్పుకి నివురు తొలుగుతున్న వేళగా అభివర్ణిస్తూ ఆ సభలోనే 'సమరశీల కలం యోధుడు సి.వి.' అనే సి.వి. రచనలపై విశ్లేషణాత్మక గ్రంథాన్ని జనసాహితి వారు ఆవిష్కరించారు.
''దేశాన్ని అమావాస్య ఆవహించింది
అధికారం అవినీతికి దారితీసింది
హద్దూపద్దూలేని నిరంకుశాధికారం
అంతూపంతూలేని అవినీతికి మార్గం వేసింది'' ఈ మాటలు నేటివేనని అనుకునేట్టుగా ఉన్నా, సరిగ్గా 55ఏండ్ల క్రితపు 'విషాదభారతం' కావ్యంలోనివని తెలిస్తేగానీ 'సివి' దార్శనికత మనను అబ్బురపరచదు. ''మధ్య యుగాల్లోకి మళ్ళీ వెళ్ళి మనం జీవిస్తున్నామా - అనేంతటి తీవ్రమైన సందేహం నేడు కలుగుతోంది'' అని కూడా 'ఆధునిక యుగంలో కుల వ్యవస్థ'లో (రచన 1980) ఆయన రాశారు. రానున్న ప్రమాదాన్ని ఎంత ముందుగా కనుగొని హెచ్చరించాడా అనిపించే మాటలవి!
మార్క్సిస్ట్ థియరీని వ్యక్తి భౌతిక అస్థిత్వానికే - పరిమితం చేయటం తెలివితక్కువతనమే కాదు, నీచం కూడా. 'ఎకనామిక్ డిటర్మినిజమ్' అనే చెత్త విమర్శకి మార్క్సిస్ట్ థియరీ కచ్చితంగా నోచుకోదు. మార్క్సిస్ట్ తత్వం వ్యక్తి భౌతిక అస్తిత్వానికే పరిమితమై లేదు. దాన్ని మించి చాలావుంది. అది మన జీవితాన్ని చూస్తుంది. మనం ఎలా బతుకుతున్నామో గమనిస్తుంది. మనం ఏం ఉత్పత్తి చేస్తున్నామో, దేంతో ఉత్పత్తి చేస్తున్నామో, దాని ఎడల మన వైఖరేంటో, ఉత్పత్తి పంపిణీల్లో మన సామాజిక అవగాహనేంటో, ఆ క్రమంలో మనుషుల మధ్య సామాజిక, సాంస్కృతిక, మానసిక అంశాలు ఎలా ముడిపడి ఉన్నాయో - అంటే యివన్నీ ఆర్థికాన్ని (ఎకానమీని) ఏ విధంగా రాజకీయం చేస్తుందీ అంతేగాక ఉత్పత్తిలో జోక్యం, కార్మిక విభజన (డివిజన్ ఆఫ్ లేబర్), ఆస్తి రూపాలు (తెగల, పురాతన, భూస్వామ్య లాంటివి) వీటిపై కాల, భౌగోళిక, సాంకేతిక మార్పులు ఎలా శక్తివంతంగా పని చేస్తాయో రాజకీయ ఆర్థికం (మార్క్సిస్ట్ పొలిటికల్ ఎకానామీ - మార్క్సిస్ట్తత్వం) నొక్కి చెపుతుంది.
అందుకే మార్క్సిజాన్ని, సమాజాన్ని, చరిత్రని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సి.వి. 2015లో శాంతిశ్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనదేశంలో రాజకీయ మార్పుకి సమాంతరంగా సాంస్కృతిక మార్పు అవసరమని మార్క్సిస్టులు గుర్తుంచుకోవాలి' అంటాడు.
తెలుగువారికి లభించిన అరుదైన ప్రజారచయిత సి.వి. యుగయుగాల భారత శ్రామికవర్గ చరిత్రయే దళిత చరిత్ర అంటూ నిర్థారించకలిగిన రాజకీయ అవగాహన సి.వి.కి ఉంది. ''మనుస్మతి అమల్లోకొచ్చి 2వేల సంవత్సరాలు దాటిపోయింది. అయినా మన మానసిక, సాంస్కృతిక, సాహితీ, సాంఘిక రంగాల్లో ఈ స్మృతి ప్రభావం విరగడకాని పీడలా, భయంకరమైన నీడలా మనల్ని నేటికీ వెన్నాడుతూనే ఉంది' అని సి.వి. ''మనుధర్మశాస్త్రం శూద్ర దళిత బానిసత్వం''లో వాపోతూ.. 'ఇండియాలోని ఏడు లక్షల మాలపల్లెల్లో ఈ మనుస్మతి గురించి విశ్లేషించండి' అని చెపుతారు. ఇది అవసరం. ఆయన 'ఆధునిక యుగంలో కుల వ్యవస్థ'లో ''వైజ్ఞానిక దృష్టికి బదులు అంధమత విశ్వాసం, హేతుబద్ధమైన ఆచరణకి బదులు నిర్జీవ కర్మకాండ, మానవ సహజమైన జిజ్ఞాసకి బదులు గొర్రెదాటుడుతత్వం, భావస్వాతంత్య్ర రాహిత్యం, అవినీతి, నైతిక విశృంఖలత్వం దేశంలో పైశాచిక తాండవం చేస్తున్నాయి'' అని అద్దాన్ని చూపిస్తాడు. అంతే కాకుండా కుల వ్యవస్థ పుట్టుకను దాని కొనసాగింపునీ ఇలా విప్పి చెపుతాడు.
''వర్ణ వ్యవస్థ (ఆధునిక కులవ్యవస్థ) కేవలం వృత్తి ఆధారంగా నిర్ణయించబడింది. పురాతన కాలంలో కుటుంబ వృత్తినే అన్ని తరాలు అనుసరించటం వలన అది వారిని అదే వర్గంలో ఉండేలా చేసింది. కానీ మధ్య యుగాలు, ఆధునిక యుగంలో ఆయా కుటుంబాలలో పుట్టడమనేది ఆయా కులాలను నిర్ధారిస్తుంది.'' ఈ మాటలు కూడా 40యేండ్ల క్రితపు 'ఆధునిక కుల వ్యవస్థ'లో సివి రాశారు.
విజ్ఞానం, విప్లవస్ఫూర్తి, సద్విమర్శ, సృజనాత్మక భావప్రకటన, రచనాపటిమ ఒక్కరిలో కలబోసి ఉండటం అరుదు. అవన్నీ సి.వి.లో ఉన్నాయి. ఆయన రచనలన్నింటికి ఓ సుదీర్ఘ వివరణాత్మక ఆవిష్కరణ ఉంటుంది. ఏ బెర్నార్డ్షాలోనో కనిపించే విషయ పరిజ్ఞానంతో కూడిన (సృజనాత్మక రచనకి) ముందుమాట వివరణ సి.వి.లో కూడా కనిపిస్తుంది. గతితార్కికంగా చరిత్రని చూడటం, అస్తిత్వ సమస్యల్ని ఆకళింపు చేసుకోవటం, శ్రమైక జీవన పరిశీలన, విప్లవ కార్యాచరణని రేపటి ఆశావహంతో దర్శించటం, అలా రాయటానికి కారణం అని నేను అనుకుంటున్నాను. అందువల్లనే సి.వి. రచనల్లో తడబాటు ఏ కోశానా ఉండదు. తీవ్రత ఉంటుంది.
నా ఉద్దేశ్యంలో కులం గురించిగాని, మతాన్ని గురించిగాని, ప్రజా పోరాటాల గురించిగాని సి.వి. రాసిన అన్ని రచనల్లో ఉండే వాడితనం, వేడితనం విప్లవ సాహిత్యంలోని కొన్ని రచనల్లో మాత్రమే దొరుకుతుంది. ''విస్మరణకు గురైన చారిత్రాత్మక కవి రచయిత సి.వి.'' అని దివికుమార్ బాధపడ్డారు. అందుకు చాలా ఉదాహరణలు ఆయన వ్యాసంలో యిచ్చారు. అలానే 'కవిగా, రచయితగా గొప్ప సాహితీవేత్తగా రావలసినంత ప్రసిధ్ధి సి.వి.కి రాలేదు' అని ప్రొఫెసర్ ఇనాక్ అన్నారు. అది నిజం. ఎందువల్లనంటే రచనకంటే స్వోత్కర్షలకి, పరిజ్ఞానం కంటే స్వప్రకటనలకి ప్రాధాన్యం యిచ్చే మన తెలుగు సాహితీ రంగం తీరు లోపంగానే దాన్ని భావించాలి.
కానీ సి.వి. వ్యక్తి ప్రాధాన్యతకి ఏ మాత్రం సందు యివ్వని తత్వజ్ఞానం నుంచి వచ్చినవాడు. తనకంటే ప్రజా చైతన్యం కలిగించే భావ ప్రకటన, సామాజిక జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యత యిచ్చినవాడు. కనుకనే మహా విజ్ఞాన సర్వస్వమైన దాదాపు తన 26పుస్తకా లపై తన్ను తాను రెండు పొడి అక్షరాలకు కుదించుకున్న గొప్ప రచయిత 'సి.వి.'
ఆకలి, అసమానతలు, అభద్రత, అసంతృప్తి వీటితో సంక్షోభాల వెంట సాగి సాగి పెట్టుబడిదారీ విధానాలు బుడగల్లా పేలిపోవడాలు చాలాసార్లు జరిగేపనే. ప్రపంచంలో యివి దశాబ్దానికి ఒకసారికి మించి జరగటం మనకి తెలీకపోతే మనకి కండ్లులేవనే! పెట్టుబడి ఊసరవల్లిలా రంగులు మార్చుకుంటుంది. ఎన్నికలు, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వీటి వెనుక దాక్కుని ఊపిర్లు పోసుకుంటుంది. అబద్ధం, అవినీతులను ఆసరాచేసు కుంటుంది. 'నాటి వ్యాస భారతం పద్దెనిమిది పర్వాలు - నేటి విషాద భారతం ఎనిమిది పర్వాలే!' అంటూ తన విషాద భారతం కావ్యంలో అధికారం ఎలా అవినీతికి దోవతీసిందీ, ప్రజాసేవకులు దేశద్రోహులు గా ఎలా పరిగణింప బడుతున్నారో, స్వరాజ్యలక్ష్మి భూసంస్కరణల శిశువును ఎందుకు కనదో సి.వి. అడుగుతాడు.
'ఆధునిక ప్రజాస్వామ్యమొక పొద్దు తిరుగుడు పువ్వు'అని చెప్పిన సి.వి. ఒక కార్యకారణ జ్ఞానం, ఒక చైతన్య వ్యవస్థ, ఒక ఉద్యమం. 'చారిత్రక వాస్తవాన్ని వక్రీకరించకుండా కవిత్వం రాయడం, అందులోనూ వచన కవిత్వం రాయడం, కత్తిమీద సాములాంటి శిక్ష' అన్న సి.వి. తన మహాకావ్యం 'పారిస్ కమ్యూన్'లో బూర్జువా న్యాయ స్థానం విధించే ఏ శిక్షకైనా సిద్ధం అంటూ ఒక కార్మిక వీరనారి చెప్పే మాటలు ఉద్యమకారుల మాటలు కావాలి.
'నేడు మేం ఓడిపోయాం. రేపు మాదే విజయం.
మేం రేపు గెలుస్తాం. ముమ్మాటికీ మాదే భవితం'
అలాంటి ఆత్మ విశ్వాసానికి ఒక ఆలోచననూ, ధిక్కారతత్వానికి ఒక అవగాహననూ, భవిష్యత్తుపై ఆశను నిలిపే విస్పష్టమయిన దార్శనికతనూ మనకిచ్చేవి సివి రచనలు! నవంబర్ 8న మూడవ వర్థంతి. ఆయనను మరింత అధ్యయనం చేద్దాం!!
(ఈ నవంబరు ఎనిమిది సివి మూడవ వర్థంతి.
వ్యాస రచయిత తెలుగు సినీ దర్శకులు)
- సి. ఉమా మహేశ్వరరావు