Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత దేశంలో మహిళ లపై లైంగిక దాడులు రోజువారి జీవితంలో సర్వసాధారణం గా మారిపోతున్నాయి. స్త్రీలపై అత్యాచారాలులేని వార్త పత్రికలను గాని, న్యూస్ ఛానల్స్ను కాని చూడలేం అంటే అతిశయోక్తి కాదు. యావత్ ప్రపంచాన్ని కదిలించిన నిర్భయ, దిశ ఘటనలలో నిందితులకు కఠిన శిక్షలు పడినప్పటికి ఈ మానవ మగాలలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ ఘటనలు మరువక ముందే, ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ లోని హథ్రస్ గ్రామానికి చెందిన దళిత యువతిని తీవ్రంగా కొట్టి, నాలుక కోసి, అత్యంత హేయంగా లైంగికదాడి చేసి చంపేశారు. భారత రాజ్యంగం ప్రకారం స్త్రీలకు సమాజంలో రక్షణ కల్పించడం చట్టపరమైన అంశం. కాని నేడు మహిళల హక్కుల ఉల్లంఘన అనేక రూపాలలో జరుగుతున్నది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2019లో 4,05,861 కేసులు నమోదు కాగా, అందులో గహహింస ద్వారా 30.9శాతం, పురుషుల వల్ల ఇంటి వెలుపల దాడులకు 21.8శాతం, కిడ్నాపులు అయిన వారు17.9శాతం, లైంగికదాడులతో 7.9శాతం మహిళలు వేధించబడ్డారు. 2018లో 3,78,236 కేసులు నమోదు అయ్యాయి. 2018తో పోలిస్తే 2019లో 7.9శాతం పెరిగింది.. 2019లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 7,444 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 6,402 కేసులు, మధ్యప్రదేశ్లో 6,053 అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. రోజుకు సుమారు 91 అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రతీ 16నిముషాలకు మహిళలు ఎక్కడో ఒక దగ్గర లైంగికదాడికి గురి అవుతున్నారు. మహిళలను రక్షించడంలో భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా133వ స్థానంలో ఉంది. వీటిని నివారించడం కోసం తల్లిదండ్రులు, మేధావులు ఎన్నో చర్చలు చేస్తున్నప్పటికీ, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకువచ్చినప్పటికీ మహిళలపై దాడులు మాత్రం అనేక రూపాలు మార్చుకుంటూ పూర్వంకంటే మరింత హింసలతో జరుగుతున్నాయి. 2018లో 87 వేల అత్యాచార కేసులు నమోదుకాగా 2010కి 4.05 లక్షల కేసులకు పెరిగాయి. క్రైమ్స్ ఇన్ ఇండియా 2019 పేరిట ఈ నివేదిక విడుదల కాగా, మహిళలపై నేరాలు 7.3శాతం పెరిగాయని, ప్రతి లక్షమందిలో దాదాపు 62.4శాతం మంది లైంగిక దాడులకు, వేధింపులకు గురి అవుతున్నవారే అని తేలింది. మహిళలతో పాటు చిన్నారుల పైన వేధింపులు 2018తో పోలిస్తే 4.5శాతం పెరిగాయి. 1.48లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. మారిన పరిస్థితుల్లో స్త్రీలు ఇంతకు పూర్వంలాగ కేవలం ఇంటికే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని రంగాలలో తమదైన గుర్తింపు పొందుతున్నారు. కానీ ఇలాంటి భయందోళన పరిస్థితులలో దేశంలో స్త్రీలకు రక్షణ కల్పించడం సవాలుగా మారింది. భారతీయ న్యాయ వ్యవస్థలు నెమ్మదిగా సాగడం, పోలిసులు వెంటనే స్పందించకపోవడం, మహిళ కేసుల విషయంలో చేసే దర్యాప్తు ఆలస్యంగా వెలుగులోకి రావడం, రాజకీయ నాయకుల నిర్లక్ష్యం, ఉన్నత వర్గాలకు చెందిన వారు పలుకుబడితో చట్టాన్ని తప్పుదోవ పట్టించడం మొదలైనవి ఇందుకు కారణాలు.
పసిపిల్లలు మొదలు పండు ముసలి వరకు, చివరికి హిజ్రాలను కూడా వదలడం లేదు. ప్రతి సంవత్సరం దాదాపు 17000 మంది అత్యచార బాధితులుగా మిగిలిపోతున్నారు. ఈ దారుణమైన నేరాల నుంచి బయటపడినవారు వారి జీవితాంతం అనేక అవమానాలకు గురవుతున్నారు. మరికొందరు జీవితాంతం జీవచ్ఛవాలుగా నడవలేని స్థితిలో ఉండిపోతుండగా, మరి కొందరు సజీవ దహనం చేయబడుతున్నారు.
భారతదేశం సంస్కృతి సాంప్రదాయలకు నిలయం. వేల సంవత్సరాలుగా స్త్రీలు దేవతలుగా పూజింపబడుతున్న దేశం. కాని ప్రస్తుతం స్త్రీలపై జరుగుతున్న దాడులను చూస్తుంటే మహిళల భద్రత ప్రమాదంలో ఉన్నట్టు తెలుస్తున్నది. తరతరాలుగా పురుషుడు స్త్రీలను తన ఆధీనంలో ఉంచుకుంటూ, స్త్రీలను ఆస్తిగా భావించాడు. అందుకే ప్రతి రోజు మహిళలు సమాజంలో లింగ వివక్షకు, అనేక వేధింపులకు గురవుతున్నారు. గహాలలో, పని చేసే ప్రదేశాలలో ఎన్నో రకాలుగా హింసించబడుతున్నారు.
భారత రాజ్యాంగం పౌరులందరికి గౌరవంగా బ్రతికే హక్కులను ఇచ్చింది. స్త్రీలు కూడా పౌరులే. వీరికున్న స్వేచ్చ, సమానత్వం, లింగ వివక్ష నుంచి విముక్తి పొందడానికి రాజ్యాంగం మహిళలకు కొన్ని ప్రత్యేక హక్కులను కల్పించింది. ఆర్టికల్15(1) ద్వారా లింగ వివక్ష చూపించ కూడదు. ఆర్టికల్ 39(డి) ద్వారా పురుషులతో పాటు సమాన వేతనం చెల్లించాలి. భర్త లేదా అతని కుటుంబ సభ్యుల నుంచి శారీరక, మానసిక, అదనపు కట్నం మొదలైన వేధింపుల నుంచి విముక్తి పొందడానికి 2005లో గృహ హింస చట్టం చేశారు. మహిళ అసభ్య ప్రాతినిధ్య చట్టం (1986) అంటే పెయింటింగ్స్, రచనలలో, ఏదైనా ప్రచురణలలో స్త్రీలను అసభ్యంగా చూపించడాన్ని నిషేధించారు. వరకట్న నిషేద చట్టం (1961), పని చేస్తున్న ప్రభుత్వ లేదా ప్రయివేటు రంగాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం (2013), కనీస వేతన చట్టం (1948) ఉన్నాయి. చిన్న పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి ఫోక్సో (2012) చట్టాన్ని సవరించే ఆర్డినెన్స్ను 2018లో కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ చట్టం ద్వారా 12ఏండ్ల వయస్సు వరకు ఉన్న పిల్లలపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణ శిక్ష విధించే కొత్త నిబంధనను తీసుకువచ్చారు. నిర్భయ చట్టాన్ని 2013లో తీసుకువచ్చారు. 2019లో దిశ చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా 14రోజులలోపే విచారణ జరిపి నిందితుడికి 21రోజుల్లోనే శిక్షపడే విధంగా చేశారు. అత్యాచారానికి గురైన మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని వేరే వారికి తెలియకుండా పోలీసులకు వ్యక్తిగతంగా లేదా మెజిస్ట్రేట్ ముందు తెలియజేసే హక్కు ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేధింపులకు గురైన మహిళ జీరో ఎఫ్ఐఆర్ కింద ఏ పోలీస్ స్టేషన్ నుంచైనా ఫిర్యాదుచేయవచ్చు. తమ రక్షణకు సంబంధించిన చట్టాలపై మహిళలందరూ అవగాహన పెంచుకోవాలి. వాటి అమలుకు కొట్లాడాలి. అప్పుడే తమను తాము అన్ని హింసల నుండి, వేధింపుల నుంచి రక్షించుకోవడానికి వీలవుతుంది.- - - వై. శివకుమార్
సెల్:963240519