Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం రూ.19 వేలు
- గరిష్టంగా రూ.లక్షా 62 వేలు
- పదవీ విరమణ వయస్సు 60 ఏండ్లకు పెంపు
- ఇంటి కిరాయి భత్యం తగ్గింపు
- గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంపు
- ప్రభుత్వానికి పీఆర్సీ కమిటీ సిఫారసులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగులకు మూల వేతనంపై 7.5 శాతం ఫిట్మెంట్ను ఇవ్వాలని సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ.19 వేలుగానూ, గరిష్ట వేతనం రూ.1,62,070గాను ప్రతిపాదించింది. వారి ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏండ్లకు పెంచాలని సూచించింది. ఇంటి కిరాయి భత్యాన్ని తగ్గించిన పీఆర్సీ... గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచుతూ సర్కారుకు నివేదించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ సర్కారు ఏర్పాటు చేసిన మొదటి వేతన సవరణ సంఘం ప్రభుత్వానికి సమర్పించిన సిఫారసులను బుధవారం ప్రజల కోసం అందుబాటు(పబ్లిక్ డొమైన్)లో ఉంచారు. 2018 మే 18న విశ్రాంత ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలో ఉమామహేశ్వరరావు, మహమ్మద్ అలీ రఫత్తో ఏర్పాటైన పీఆర్సీ కమిటీ... 2020 డిసెంబర్ 31న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఉద్యోగుల వేతన సవరణ, పదవీ విరమణ వయస్సు పెంపు సహా ఇతర భత్యాలు, తదితరాంశాలపై కమిటీ తన సిఫారసులను నివేదించింది. వాటి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను మూల వేతనంపై ఏడున్నర శాతం పెంచాలంటూ ప్రతిపాదించింది. పెరిగిన ధరలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని 45 నుంచి 80 శాతం వరకు వేతనాలను పెంచాలంటూ ఉద్యోగ సంఘాల కోరాయని కమిటీ తెలిపింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని సిఫారసులు చేస్తున్నట్టు రిపోర్టులో వివరించింది.
మూలవేతనంపై 7.5 శాతం పెంపు
మూల వేతనంపై ఏడున్నర శాతం వేతనాలను పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. 2018 జూలై నుంచి పెరిగిన 30.392 శాతం డీఏతోపాటు ఏడున్నర శాతం ఫిట్మెంట్ను కలిపి వేతన స్కేళ్లను సవరించాలని కోరింది. 2018 జూలై ఒకటి నుంచే వేతన సవరణను వర్తింపజేయాలన్న కమిటీ ఉద్యోగుల డిమాండ్లు, రాష్ట్ర వనరులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలంటూ సూచించింది.
రెండు డీఏల విధానం : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న 'ఏడాదిలో రెండు డీఏల విధానాన్ని' కొనసాగించాలని కమిటీ సూచించింది. ఇంటి కిరాయి భత్యాన్ని స్లాబుల వారీగా తగ్గించింది. ఆయా ప్రాంతాల్లోని జనాభా ఆధారంగా ఇప్పటి వరకు ఉన్న 30, 20, 14.5, 12 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏను 24, 17, 13, 11 శాతాలకు కుదించింది. శిశుసంరక్షణా సెలవులను 90 రోజుల నుంచి 120 రోజులకు పెంచాలంటూ సూచించింది. వికలాంగులైన చిన్నారులు ఉంటే ఆ సంఖ్యను రెండేండ్ల వరకు పెంచాలని ప్రతిపాదించింది. ఉద్యోగుల పిల్లలకు కేవలం తండ్రి మాత్రమే ఉంటే వారికి కూడా శిశుసంరక్షణా సెలవులు ఇవ్వాలంటూ సిఫారసు చేసింది. ఉద్యోగుల మూలవేతనం, పెన్షనర్ల పింఛనులో ఒకశాతాన్ని వసూలు చేసి... ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని సూచించింది.
రూ.2,252 కోట్ల అదనపు భారం
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విశ్రాంత ఉద్యోగుల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసి వారికి ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని సిఫారసు చేసింది. ఎల్టీసీ సౌకర్యాన్ని సర్వీసు మొత్తంలో నాలుగుసార్లు దేశంలో ఎక్కడైనా ఎలాంటి పరిమితులు లేకుండా కల్పించాలని కోరింది. బ్లాకు పీరియడ్ అయిన నాలుగేండ్లలో ఒకసారి ఈ సౌకర్యాన్ని వినియో గించుకోవచ్చు. ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల కోసం ఇచ్చే మొత్తాన్ని రూ. 30 వేలకు పెంచుతూ సిఫారసు చేసింది. పెన్షనర్లకు కనీస పింఛను రూ. 9,700గా ప్రతిపాదించింది. 15 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరికీ పూర్తి పెన్షన్ ఇవ్వాలని సిఫారసు చేసింది. గ్రాట్యుటీని 12లక్షల నుంచి 16 లక్షల కు పెంచాలని సూచించింది. సీపీఎస్ పథకానికి ఉద్యోగుల వాటాను పదినుంచి 14శాతానికి పెంచాలనీ, పాత ఫించన్ వర్తించే ఉద్యోగుల తరహాలో సీపీఎస్ విశ్రాంత ఉద్యోగులకు కూడా డెత్రిలీఫ్ ఇవ్వాలని సూచిం చింది. ఫుల్ టైం, పార్ట్ టైం, కంటింజెంట్ ఉద్యోగులు, డైలీవేజ్, ఎన్ఎంఆర్లకు కూడా సెలవులు, ఇతర ప్రయోజనాలను కల్పించాలని కమిటీ సూచించింది. వీటి అమలుద్వారా ఖజానాపై ఏడాదికి 2,252కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపింది.
సామాన్యుల పట్ల ఉద్యోగులకు గౌరవం లేదు
ఒప్పంద అధ్యాపకులకు ఇస్తున్న వేతనాలను కూడా పెంచాలన్న కమిటీ... కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులన్నింటినీ రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని సూచించింది. భర్తీ సమయంలో ఒప్పంద పద్ధతిన పనిచేస్తున్న అధ్యాపకులకు వెయిటేజ్ ఇవ్వాలని కోరింది. గ్రూప్ 3, 4 పోస్టుల భర్తీలోనూ ఇప్పటికే తాత్కాలిక పద్ధతిని పనిచేస్తున్న వారికి వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలంటూ సిఫారసు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించే తల్లిదండ్రులకు రూ.2వేల ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించింది. ఐతే గతంలో ఉన్న ట్యూషన్ ఫీజు రాయితీని రద్దు చేసింది. పెన్షన్ అర్హత లేని కుటుంబాలకు కనీస పెన్షన్తో సమానంగా ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరింది. ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబ పెన్షన్ ఏడేండ్లు లేదా ఉద్యోగి జీవించి ఉంటే 65 సంవత్సరాల వరకు ఏది ముందైతే అప్పటి వరకు చివరి నెల వేతనంలో సగం కుటుంబ పెన్షన్ ఉండేది. ఇప్పుడు దాన్ని 10 సంవత్సరాల వరకు లేదా 65 సంవత్సరాలకు పెంచారు.
నివేదిక కసరత్తు సమయంలో ప్రజల నుంచి కొన్ని విజ్ఞప్తులు వచ్చాయని తెలిపిన కమిటీ... సామాన్యుల పట్ల ఉద్యోగులకు గౌరవం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపింది. అత్యధిక మంది ఉద్యోగులకు విషయంపై సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల అంత సమర్థవంతంగా పనిచేయడం లేదనీ, అలక్ష్యంతో పనుల్లో చాలా జాప్యం జరుగుతోందనీ, క్షేత్రస్థాయిలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదనీ, అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రజలు కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్టు నివేదికలో పేర్కొంది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే సమయంలో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలనీ, మరింత సమర్థంగా సేవలు అందించేలా వేతన సవరణ ఉండాలంటూ ప్రజలు కోరినట్టు తెలిపింది. పెరిగిన పనిభారం, ఎక్కువ సంఖ్యలో ఖాళీలు, సరైన వాహన సౌకర్యం లేకపోవటం లాంటి సమస్యలను ఉద్యోగులు ప్రస్తావించారని వివరించిన కమిటీ... వాటన్నింటినీ పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి సూచించింది.