Authorization
Mon Jan 19, 2015 06:51 pm
15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు అన్యాయమేమీ చేయలేదని మనకి ముందు అనిపిస్తుంది. కేంద్రం వసూలు చేసే పన్నులలో కొంత భాగాన్ని కేంద్రం రాష్ట్రాలతో పంచుకోవాల్సి ఉంటుంది. ఆ పంపిణీ ఏవిధంగా ఉండాలన్నది సిఫార్సు చేయడానికే ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. 2021-2026 మధ్య ఐదేండ్లలో ఈ పంపిణీ ఏవిధంగా ఉండాలన్నది 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 42శాతం వాటా ఉండాలని చెప్తే, 15వ ఆర్థిక సంఘం దానిని 41శాతానికి తగ్గించింది. జమ్ము-కాశ్మీర్ ఒక రాష్ట్రంగా ఇప్పుడు లేనందున, ఈ విధంగా రాష్ట్రాల వాటాలో ఒకశాతం తగ్గింది. వివిధ రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికన పంపిణీ జరుగుతుంది. దీనిపై కొన్ని రాష్ట్రాలు ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కుటుంబ నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టి జనాభాను నియంత్రిస్తే అందుకు అదనంగా ప్రోత్సాహకాలు ఇవ్వడంపోయి వాటాలను తగ్గించడం సరైనది కాదని అవి వాదిస్తున్నాయి. అందుచేత 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కాకుండా, 1971 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని కోరుతున్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 14వ ఆర్థిక సంఘం 1971 జనాభా లెక్కలకు 17.5శాతం, 2011 జనాభా లెక్కలకు 10శాతం వెయిటేజి ఇచ్చింది. ఈ మారు 15వ ఆర్థిక సంఘం 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోలేదు. 2011 జనాభా లెక్కలకు 10శాతం వెయిటేజి ఇచ్చింది. దానితోబాటు గర్భధారణ రేటు (ఫెర్టిలిటీ రేటు)కు 12.5శాతం వెయిటేజి ఇచ్చింది. ఈ నిధుల పంపిణీ సూత్రం ఫలితంగా కొన్ని రాష్ట్రాలకు రావలసిన ఆదాయం తగ్గి వాటి రెవెన్యూలోటు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి రాష్ట్రాలకు 'రెవెన్యూలోటు గ్రాంటు' ఇచ్చే ఆనవాయితీని కొనసాగిస్తూ అటువంటి 17 రాష్ట్రాలకు రూ.2.95 లక్షల కోట్లు గ్రాంటు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఇంతవరకూ చూస్తే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది.
రాష్ట్రాల ఇబ్బందులు
అయితే రాష్ట్రాలు చాలా కాలంనుంచీ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను 15వ ఆర్థిక సంఘం పరిష్కరించేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. ప్రత్యక్ష పన్నుల విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించే విధానం అమలులో ఉంది. దానికి తోడు జీఎస్టీ విధానాన్ని తీసుకువచ్చినందున చాలా రాష్ట్రాలకు అంతవరకూ వస్తూ ఉండిన ఆదాయం తగ్గిపోయింది. మరోవైపు ద్రవ్యలోటు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము విధించిన పరిమితిని దాటరాదన్న ఎఫ్ఆర్బిఎం నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాల కాళ్ళూ, చేతులూ కట్టేసినట్టయింది. ఇందువలన రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అనివార్యమైన ఖర్చులను కూడా పెట్టగలిగే పరిస్థితి లేకుండా పోయింది. 2020-21సంవత్సరంలో ఆర్థిక సంక్షోభం ముదిరిపోవడంతోబాటు కరోనా విజృంభించడం ఫలితంగా మామూలుగా వసూలయ్యే పన్నులు కూడా రావడంలేదు. మరోపక్క ప్రభుత్వం చేయవలసిన ఖర్చు పెరిగింది. జీఎస్టీ విధానంలో ఏటా 14శాతం ఆదాయం పెరుగుతుందని, ఒకవేళ అలా పెరగకపోతే ఆ తేడాను కేంద్రమే భర్తీ చేస్తుందని హామీ ఇచ్చి జీఎస్టీ అమలుకు రాష్ట్రాలను ఒప్పించారు. కాని ఆచరణలో ఆదాయం పెరగనూలేదు, కేంద్రం ఆ లోటును భర్తీ చేసిందీ లేదు. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఈ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించే మార్గం ఏమిటన్న అంశంపై 15వ ఆర్థిక సంఘం దృష్టి పెట్టివుండాల్సింది.
ప్రభుత్వం అనుసరించే పన్నుల విధానం ఏ విధంగా ఉండాలన్నది ఆర్థిక సంఘం పరిధిలోకి రాదు. కాని ఆర్థిక వ్యవహారాలను ఏవిధంగా నిర్వహించుకోవాలో సిఫార్సు చేయడం దాని పని. ఆదాయాలను ఏవిధంగా పెంచుకోవాలో చెప్పాలనప్పుడు ఖర్చులను ఏవిధంగా తగ్గించుకోవాలో నియంత్రించడం కష్టమైనపనే. అయితే ఆ పరిమితుల్లో కూడా రాష్ట్రాలు ఎదుర్కొనే క్లిష్టపరిస్థితికి పరిష్కారం చూపే బదులు, 15వ ఆర్థిక సంఘం కేంద్రం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలను సమర్థించడానికే మొగ్గు చూపించింది. అసలే రెవెన్యూ ఆదాయాలు తగ్గిపోతున్న రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచే చర్యలను సూచించకుండా కేంద్రం తన నిధులను పెంచుకోడానికి తీసుకుంటున్న చర్యలను సమర్ధించింది. 2018-19లో రాష్ట్రాలకు అందిన వాటా రూ.7.6 లక్షల కోట్లు. ఆ వాటా క్రమంగా పెరిగే విధంగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సు ఉండాల్సింది. కాని 2021-22కి ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన వాటా కేవలం రూ.6.7 లక్షల కోట్లు మాత్రమే.
కార్పొరేట్లకు రాయితీలు- రాష్ట్రాలకు తగ్గిన వాటా
ఆర్థిక సంక్షోభంలోనుంచి దేశాన్ని బైటకు తెచ్చే చర్యలు చేపట్టే బదులు కేంద్రం దేశాన్ని మరింత లోతుగా సంక్షోభంలోకి నెట్టే విధానాలనే అమలు చేస్తోంది. 2019లో కార్పొరేట్లను ప్రోత్సహించాలన్న నయా ఉదారవాద సిద్ధాంతానికి అనుగుణంగా కార్పొరేట్ పన్ను 30శాతం నుంచి 22శాతానికి తగ్గించింది. కొత్తగా ప్రారంభించిన సంస్థలకు 25శాతం నుంచి 15శాతానికి తగ్గించింది. అందువలన కార్పొరేట్ పన్ను వసూళ్ళు ఒక్కసారిగా రూ.1,50,000 కోట్ల మేరకు తగ్గిపోయాయి. అందువలన రాష్ట్రాలకు వచ్చే వాటాలో రూ.65,000 కోట్లు తగ్గాయి. ఈ నిర్ణయం తీసుకునేముందు కేంద్రం రాష్ట్రాలను సంప్రదించనేలేదు. ఈ నిర్ణయం వలన కేంద్రానికి కూడా ఆదాయం తగ్గుతుంది. అయితే రిజర్వుబ్యాంకు నుంచి స్పెషల్ డివిడెండ్లను తీసుకోవడం ద్వారా, ప్రభుత్వ రంగ ఆస్థులను అమ్మడం ద్వారా, ద్రవ్యలోటు లక్ష్యాలను తాత్కాలికంగా పక్కనబెట్టి అప్పులు చేయడం ద్వారా తగ్గిన ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేసుకోగలదు. అటువంటి అవకాశాలు ఏవీ రాష్ట్రాలకు లేవు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాల ఇబ్బందులను అధిగమించే మార్గాలను 15వ ఆర్థిక సంఘం సూచించి ఉండాల్సింది. ఆ విధమైన సూచనలేవీలేవు. పైగా రాష్ట్రాలకు వచ్చే వాటాను వివిధ రాష్ట్రాలు తమ మధ్య ఏవిధంగా పంచుకోవాలన్న విషయంలో ఒక కొత్త కొలబద్దను ప్రవేశపెట్టింది. తలసరి పన్ను ఆదాయం, తలసరి స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ) ఎక్కువగా ఉంటే ఆ రాష్ట్రానికి ఎక్కువ వాటా వస్తుంది. కానీ పన్ను ఆదాయం ఎంత తగ్గినా, కేంద్రానికి వచ్చే వాటా మాత్రం తగ్గదు. ఈ విధంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాల వైపు కాకుండా 15వ ఆర్థిక సంఘం కేంద్రం వైపే మొగ్గు చూపింది.
సెస్లు, సర్చార్జీల పేరుతో డొంకతిరుగుడుగా కేంద్రం
పన్నుల రూపంలో వసూలు చేస్తే ఆ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాలతో పంచుకోవలసి ఉంటుంది. అదే కొన్ని రకాల సెస్ల పేరుతోనో, సర్చార్జి పేరుతోనో వసూలు చేస్తే అందులో రాష్ట్రాలకు ఏవాటానూ ఇవ్వనవసరం లేదు. కేంద్రం ఈ కాలంలో ఈ డొంకతిరుగుడు పద్ధతిని ఎక్కువగా అనుసరిస్తోంది. 2010-11లో సెస్లు, సర్చార్జీల ద్వారా కేంద్రానికి 10.4 శాతం వస్తే (మొత్తం రెవెన్యూ ఆదాయంలో) అదే 2020-21 బడ్జెట్ అంచనాల ప్రకారం 19.9శాతం వస్తోంది. జీడీపీలో శాతంగా చూసినప్పుడు కేంద్రం పన్నుల వాటా 10.4 నుంచి (2012-13) 9.9శాతానికి (2019-20) తగ్గింది. అదే కాలంలో సెస్లు, సర్చార్జీల ద్వారా వచ్చేది 0.9శాతం నుంచి ఏకంగా 17శాతానికి పెరిగింది. ''ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫార్సులను తారుమారు చేసే విధంగా సెస్లు, సర్చార్జీలు పెంచడం రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా లేదు. దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరగాలి'' అని ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె. సింగ్ అన్నారే కాని ఎటువంటి నిర్దిష్టమైన ప్రతిపాదనలనూ చేయలేదు.
నయా ఉదారవాదాన్ని వేగవంతం చేస్తున్న సిఫార్సులు
ఇది చాలదన్నట్టు రాష్ట్రాలు కూడా నయా ఉదారవాద విధానాలను తమ పరిధుల్లో మరింత వేగంగా అమలు చేసేలా ఒత్తిడి పెంచే సిఫార్సుల్ని 15వ ఆర్థిక సంఘం చేసింది. 1. కేంద్రం ప్రవేశపెట్టే స్కీములకు, రంగాలకు రాష్ట్రాలు తమ వనరులను కూడా తోడు చేస్తే అప్పుడు ఆ రాష్ట్రాలకు లభించే వాటా పెంచాలని, 2. రాష్ట్రాలు వివిధ రంగాలను నిర్వహించే తీరు బట్టి నిధులను అదనంగా విడుదల చేయాలని సిఫార్సు చేసింది. (ఉదాహరణకు విద్యుత్ రంగంలో ప్రయివేటీకరణ, విద్యారంగంలో నూతన విద్యావిధానం అమలు వంటివి) ఇటువంటి కొలబద్దలను ఉపయోగించి రాష్ట్రాలకు బదలాయించే నిధులు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 17శాతం ఉంటే అది కాస్తా ఏకంగా 57శాతానికి పెంచుతూ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.
స్థానిక సంస్థలనూ విడిచిపెట్టలేదు
స్థానిక సంస్థలకు రూ.4.36 లక్షల కోట్ల నిధులను కేటాయిస్తూ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. అయితే ఈ మొత్తంలో అత్యధికశాతం ఆ స్థానిక సంస్థలు కేంద్రం విధించిన షరతులను అమలు చేస్తేనే విడుదల అవుతాయి (ఉదాహరణకు ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను, తాగునీటికి చార్జీలు, సేవలను ఔట్సోర్సింగ్కు ఇవ్వడం వగైరా). 2024 మార్చి నాటికి గనుక ఆ సిఫార్సులు పూర్తిగా అమలు చేయకపోతే ఆ తర్వాత స్థానిక సంస్థలకు ఎటువంటి నిధులూ విడుదల చేయకూడదని కూడా సిఫార్సు చేసింది.
దేశ రక్షణకు, భద్రతకు అయ్యే వ్యయంలో రాష్ట్రాలు కూడా వాటా భరించాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనను 15వ ఆర్థిక సంఘం ఆమోదించింది. దీని పర్యవసానంగా రాష్ట్రాలకు వచ్చే నిధులు ఇంకా తగ్గిపోతాయి.
గ్రాంట్లు లేకుంటే పోయె - అప్పులకూ అనుమతి లేదు
ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్లో కనీసం తాము మరింత అప్పు చేయడానికైనా అనుమతించాల్సిందిగా రాష్ట్రాలు కోరుతున్నాయి. కాని 15వ ఆర్థిక సంఘం దానికి కూడా సానుకూలంగా సిఫార్సు చేయలేదు. ఇదివరకు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం 3శాతం వరకూ రాష్ట్రాలు అప్పులు తెచ్చుకోవచ్చు. కోవిడ్ సంక్షోభం తర్వాత రాష్ట్రాలు తమ జీఎస్డీపీలో 4శాతం వరకు అప్పులు తెచ్చుకోవచ్చునని అనుమతించారు. ఇది 2021-22 సంవత్సరం వరకు మాత్రమే. 2022-23లో ఇది 3.5శాతానికి, 2025-26 నాటికి మళ్ళీ 3శాతానికి తగ్గాలి. అదనంగా అనుమతించిన 1శాతాన్ని కూడా ఒక్క ఏడాదికే పరిమితం చేశారు. అది కూడా కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలను అమలు చేసిన రాష్ట్రాలకే అనుమతించారు.
మొత్తంగా చూస్తే, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు కేంద్రం చేతుల్లో ఆర్థిక అధికారాలు మరింత కేంద్రీకృతం కావడానికి, నయా ఉదారవాద విధానాలు మరింత వేగంగా అమలు జరగడా నికి మాత్రమే దోహదం చేస్తాయి. రాష్ట్రాల ఆర్థిక శక్తిని మరింత దెబ్బ తీస్తాయి. బహుశా అందుకేనేమో, కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులను అంగీకరిస్తూ వెంటనే ఒక ప్రకటన చేసేసింది.
- సి.పి.చంద్రశేఖర్