Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో మునుపెన్నడూలేని విధంగా ఓవైపు కార్పొరేట్ కంపెనీల లాభాలు అమాంతం పెరుగిపోతుంటే, మరోవైపు బ్యాంకులలో పారిశ్రామికవేత్తల, సంపన్నుల మొండి బకాయిలు సైతం వాటితో పోటీ పడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ అభియాన్ ప్యాకేజీ కార్పొరేట్ కంపెనీలకు మరిన్ని రాయితీలు ఇచ్చి వాటి సంపద, లాభాలు మరింత పెంపొందడానికి తోడ్పడిందే కానీ వారి నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రావలసిన మొండి బకాయిలను రాబట్టడానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇటీవల విడుదలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టు (ఎఫ్ఎస్ఆర్) ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టింది. యూపీఏ పాలనలో 2008 నుంచి 2014 వరకు, ఎన్డీఏ పరిపాలన 2014 నుంచి 2020 వరకు మొత్తం 12 సంవత్సరాల కాలానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పీఏల(నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్) గణాంకాలను ఆర్బీఐ విశ్లేషించింది. బీజేపీ ఆరేండ్ల పాలనా కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులలో మొండి బకాయిలు (ఎన్పీఏ) 365శాతం పెరిగాయని ఆర్బీఐ గణాంకాలు నిగ్గుతేల్చాయి. యూపీఏ పరిపాలన కాలంలో మొండి బకాయిల రద్దు (రైటాప్)తో పోల్చితే మోడీ హయాంలో ఏకంగా ఇరవై ఒక్క రెట్లు బడా కార్పొరేట్లు, అత్యంత సంపన్నుల బ్యాంకు రుణాలు రద్దు (రైటాప్) కావడం నివ్వెరపరిచే పరిణామం.
రుణాలు తీసుకున్న కంపెనీలు, వ్యక్తులు ఆ రుణాలను తిరిగి చెల్లించకపోతే వాటిని బ్యాంకులు మొండి బకాయిలు (స్థూల ఎన్పీఏలు)గా మార్చుతాయి. స్థూల ఎన్పీఏ అంటే చెల్లించని అప్పుల మొత్తాన్ని సూచించే బ్యాంకులు ఉపయోగించే పదం. ఇది నిరర్ధక రుణాలుగా వర్గీకరించబడుతుంది. నాలుగేండ్ల కాలవ్యవధి దాటిన ఎన్పీఏలను బ్యాంకులు రద్దు (రైటాప్) చేసి బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లనుంచి తీసి వేస్తాయి. యూపీఏ హయాంలో 2008-2009 నుంచి 2013-14 వరకు ఆరు ఆర్థిక సంవత్సరాలలో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు(జిఎన్పీఏ) 5,04,021 కోట్లుగా నమోదుకాగా, 32,109 కోట్ల రూపాయలను యూపీఏ ప్రభుత్వం మొండి బకాయిల కింద రద్దు(రైటాప్) చేసింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019- 20 ఆర్థిక సంవత్సరం నాటికి ఆరేండ్లలో అనూహ్యంగా 18,28,584 కోట్ల రూపాయలు మొండి బకాయిలు(ఎన్పీఏలు) పెరిగిపోయాయి. గత ఆరేండ్ల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులలో మొండి బకాయిలు పెద్దమొత్తంలో పెరుగుతూనే ఉన్నాయి. 2014 -15లో రూ.1,77,860కోట్ల నుంచి 2015-16 నాటికి 3,85,961కోట్లకు మొండి బకాయిలు చేరుకున్నాయి. 2016-17లో ఎన్పీఏలు 3,27,593 కోట్లుగా నమోదై స్వల్పంగా తగ్గినప్పటికి 2017-18లో 4,88,175 కోట్లకు పెరిగాయి. 2018-19లో 2,10,531కోట్లుగా ఉన్న మొండి బకాయిలు 2019-20 నాటికి 2,38,464 కోట్లకు పెరిగి మొత్తం మోడీ పరిపాలనలో 18,28,584 కోట్లకు ఎన్పీఏలు పెరగాయి. యూపీఏ పరిపాలన కాలంలో 2008-14 వరకు 32,109 కోట్ల ఎన్పీఏల రద్దు (రైటాప్) జరిగితే, బీజేపీ ప్రభుత్వం 2014-20 వరకు 6,83,388 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు(రైటాప్) చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే భారీ మొత్తంలో 1,78,305 కోట్ల ఎన్పీఏలను రైటాప్ చేయడం జరిగింది. యూపీఏ హయాంలో మొండి బాకీల రద్దుతో పోల్చితే బీజేపీ పాలనలో మొండి బాకీల రద్దు(రైటాప్) 21 రేట్లు పెరగడం కార్పొరేట్ సంపన్నులపై బీజేపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను తెలియజేస్తోంది. ఆర్బీఐ డేటా ప్రకారం 2014 తర్వాత బడా కార్పొరేట్లు, అపర కుబేరులు బ్యాంకులకు రుణాల ఎగ్గొట్టడం స్పష్టంగా కనబడుతోంది. నీరవ్ మోడీ, విజరు మాల్యా, లలిత్ మోడీ, మోహిల్ చోక్సి బ్యాంకులను నిండా ముంచి విదేశాలకు పారిపోతున్న క్రమంలో ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించింది. వారిని తిరిగి దేశానికి రప్పించడంలో ప్రభుత్వ చర్యలు నిరాశా జనకంగా ఉన్నాయి. సామాన్య ప్రజల డబ్బుతోనే వ్యాపారం చేసే బ్యాంకులు వారికి రుణం కావాలంటే సవాలక్ష కాగితాలు, ష్యూరిటీలు అడిగి పలు పర్యాయాలు తమ చుట్టూ తిప్పుకుని కొందరికి కొద్దిపాటి రుణాలు మంజూరు చేస్తున్న క్రమంలో దీనికి భిన్నంగా కార్పొరేట్ పెట్టుబడిదారులకు రాజకీయ ప్రాబల్యంతో పిలిచి మరీ రుణాలు కట్టబెడుతున్నాయి. ఇవి సక్రమంగా వసూలు కాకపోవడంతో లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ అండదండలతో రద్దు (రైటాఫ్) చేస్తూ, వారి పేర్లను కనీసం బయట పెట్టలేకపోతున్నాయి. ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో సేకరించిన డబ్బును కార్పొరేట్ వర్గాలకు పందేరం వేస్తున్న బ్యాంకులు తిరిగి వాటిని వసూలు చేసుకోలేక రద్దు చేస్తుండటంపై పలు విమర్శలు ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల నుంచి తాము పొందే కొద్దో, గొప్పో రుణానికి సంబంధించిన ఒకటి, రెండు ఈఎంఐలు కట్టకపోతే వారి పేర్లను రచ్చచేసి, ఏజెంట్లను ఇంటికి పంపి పరువు తీసే ప్రయత్నాలతో అనేకమంది బలవన్మరణాలకు పాలుపడ్డ సంఘటనలు కోకొల్లలు. మితిమీరిన మొండి బాకీల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు నేడు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులలో మొండిబాకీలకు కారణమైన వ్యక్తుల, సంస్థల పేర్లతో నమోదైన మొత్తాలను ప్రకటించాలి. రైటాప్ చేయబడిన రుణాలకు సంబంధించిన బడా కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పౌర సమాజం ముందు బహిర్గతం చేయాలి. వాస్తవంగా వివిధ కంపెనీలు లాభాలు సాధిస్తున్నప్పటికీ దివాళా తీసినట్టు తమ ఖాతా పుస్తకాలలో చూపి బ్యాంకులకు రుణాలు ఎగ వేస్తూ, మరల కొత్త కంపెనీల పేరుతో వందల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నాయి. ఇలాంటి సంస్థలపై, వ్యక్తులపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాంకులలో మోసాలకు పాల్పడుతున్న మొండి బకాయి దారులను, సంస్థలను గుర్తించి వారు తీసుకున్న రుణాలను తిరిగి రికవరీ చేసినప్పుడే బ్యాంకులు పరిపుష్టమై సామాన్య ప్రజలు బ్యాంకులలో దాచుకున్న సొమ్ముకు భద్రత చేకూరుతుంది.
- బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి
సెల్:440966416