Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయోద్యమ నేతలందరూ భారత జాతిని ఏకతాటి మీదకు తెచ్చి దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టారు. నాడు వారు వేసిన సెక్క్యులర్ ప్రజాస్వామిక బావజాలమే స్వాతంత్య్రానంతరం దేశాన్ని ఐక్యంగా నడిపించగలిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి దేశం అభివృద్ధి వైపు అడుగులు వేయడం మొదలయ్యింది. అడపాదడపా కొన్ని సంఘటనలు జరిగినా 73సంవత్సరాలుగా భారతజాతి తమ ఐక్యతను చాటుతూ వచ్చింది. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక, లౌకికదేశంగా పేరు తెచ్చుకుంది. మన రాజ్యాంగం కూడా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా గుర్తింపు తెచ్చుకుంది. దేశం అనాదిగా భిన్నత్వంలో ఏకత్వంగా ముందుగు సాగుతోంది అంటే.. ప్రజలలో బలంగా నెలకొని ఉన్న లౌకిక, ప్రజాస్వామిక భావాలే కారణం. అయితే నేడు ఆ భిన్నత్వంలో ఏకత్వానికీ, ప్రజాస్వామ్య విలువలకూ, రాజ్యాంగ నియామకాలకూ ప్రమాదం తలపెట్టే మతతత్వ శక్తుల ప్రయత్నాలు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. ఈ శక్తులు నాటి నుంచి నేటి వరకు అనేక సందర్భాలలో తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. రామమందిరం పేరుతో దేశ వ్యాపితంగా రథయాత్ర చేశారు. ఆ ప్రయత్నం కొంత వరకు ఫలించిందనే చెప్పాలి. ప్రజల్లో భావోద్వేక్రాలు పెంచగలిగారు. అయితే ఆ బావోద్రేకాలు దేశానికి ప్రమాదం అని గుర్తించి ప్రజలు అప్రమత్తమయ్యారు. ఇందుకు నాడు వామపక్షాలు, ప్రజాస్వామిక శక్తులు దేశంలో బలంగా ఉండటమే కారణం. అలాగే కాంగ్రెస్తో పాటు లౌకికవాద ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. దీంతో మతతత్వ శక్తులకు చెక్ పడ్డది.
ఇది గుర్తించిన సంఫ్ుపరివార్ సెక్యులర్ డెమోక్రాటిక్ భావజాలాన్ని దెబ్బ కొట్టకుండా మనం ముందుకు పోలేమని గుర్తించింది. భావోద్రేకాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య బలమైన విభజన రేఖ గీయాలని భావించింది. అందుకు తగ్గట్టుగా ఎజండాను రూపొందించింది. దానిని మొదలు గుజరాత్లో అమలు చేసే బాధ్యతలను మోడీ, షాలకు అప్పగించింది. దాని ఫలితమే గోధ్రా సంఘటన. ఆ సంఘటనతో వారు ఆశించిన ఫలితాలు వచ్చాయని భావించారు. ఈ ఫార్ములానే దేశ వ్యాపితంగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఆ బాధ్యతను గుజరాత్లో విజయవంతంగా అమలు చేసిన మోడీ, షాల ధ్వయానికి అప్పగించింది. దానికి తగ్గట్టుగా దేశ ప్రధాని అభ్యర్థిగా మోడీనీ, జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షాను ప్రమోట్ చేసింది. వీరి సారథ్యంలో కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. మోడీ -షాల ద్వయం తమ సంఫ్ుపరివార్ ఎజండాను అమలు చేసే పనికి శ్రీకారం చుట్టారు. నెహ్రు, గాంధీల సెక్యులర్ ప్రభావాన్ని ఒక వైపు తగ్గిస్తూనే మరో వైపు యువకులలో భావోద్రేకాలను పెంచే విధంగా రోడ్ మ్యాప్ తాయారు చేసారు. దీనికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా గోవులను వధశాలకు తరలిస్తున్నా రంటూ బహిరంగంగా మూక దాడులకు పూనుకున్నారు. ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లారు. తద్వారా యువకులలో భావోద్రేకాలను పెంచే చర్యకు పూనుకున్నారు. అంతే కాదు నెహ్రూ, గాంధీల సెక్యులర్ భావాలపై దాడి పెంచారు. ఈ దాడి గాంధీ దేశ ద్రోహి, గాడ్సే దేశ భక్తుడు అని చెప్పే వరకూ వెళ్లింది. అంతే కాదు నెహ్రూను అభిమానించి చివరి వరకు ఆయనతోనే ఉండటమే కాకుండా తాను చనిపోయే ముందు తన శిష్యులకు కూడా నెహ్రూను విడవకండి అని చెప్పిన వల్లభాయి పటేల్ను రాజకీయంగా తమ సొంతం చేసుకునేందుకు పథకం రచించారు. తద్వారా భారత స్వాతంత్య్రద్యమంలో తమకు భాగస్వామ్యంలేని లోటును పూడ్చుకోవాలని పన్నాగాలుపన్నారు. అందుకు 597 అడుగుల ఎత్తైన పటేల్ విగ్రహాన్ని గుజరాత్లో ఏర్పాటు చేసారు. తద్వారా పటేల్ను నెహ్రూకు వ్యతిరేకంగా నిలిపేందుకు ప్రయత్నించారు. దీనిని బట్టి చూస్తుంటే సంఫ్ుపరివార్ ఎంత పకడ్బందీగా తన రోడ్మ్యాప్ను అమలు చేస్తుందో అర్ధం అవుతుంది.
ఒక వైపు ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఎజండాను అమలు చేస్తూనే మరో వైపు కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీలను బలహీన పరిచే చర్యకు మోడీ, షాలు పూనుకున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వారిని తోసి తాము అధికారంలోకి వచ్చే ప్లాన్ అమలు చేస్తూపోతున్నారు. పార్లమెంట్లో చట్టాల ద్వారా రాష్ట్రాలకున్న అధికారాలకు కత్తెరవేస్తూ పరోక్షంగా ప్రాంతీయ పార్టీలను బలహీన పరిచేందుకు పూనుకుంటున్నారు. ఇలా బహు రూపంలో తమ ప్లాన్ను అమలు చేస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దు, తలాక్ బిల్లు, రామమందిర్ నిర్మాణం, పుల్వామా దాడి, చైనా పాకిస్థాన్ దాడులు ఇలా అన్నిటినీ తమకు అనుకూలంగా మలచుకుంటూ జాతీయభావం పేరుతో యువకులలో పరోక్షంగా తమ భావజాలాన్ని నింపే ప్రయత్నం సంఫ్ుపరివార్ చేస్తున్నది. తమ రోడ్మ్యాప్ను దేశంలో విజయవంతంగా అమలు చేసుకునేందుకు వామపక్ష, ప్రజస్వామిక శక్తులు బలహీనపడడం వారికి బాగా కలిసివచ్చింది. కేంద్రంలో రెండోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో వారిలో విశ్వాసం మరింత పెరిగింది. తాము ఏమి చేసినా ప్రజలు ఆమోదిస్తారనే భావనకు వెళ్లారు. నల్లధనం తెస్తామని తేకపోయినా, సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకపోయినా, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, లాక్డౌన్లతో దేశ ఆర్ధిక పరిస్థితి బాంగ్లాదేశ్ కన్నా దిగజారినా ప్రజలు వాటిని పట్టించో కోవడం లేదనే భావనలో ఉన్నారు. పరిస్థితులు చూస్తుంటే వారు ఎంత పెద్ద ఎత్తున భావోద్రేకాలను పెంచగలిగితే అంత లాభమనే నిర్ణయానికి వచ్చినట్టు కనపడుతున్నది.
తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రుల దగ్గర నుంచి రాష్ట్ర నాయకులు దాకా అందరూ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ప్రజల మధ్య బలమైన విభజన తెచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నట్టు అర్థం అవుతున్నది. 2014 నుంచి దేశంలో తమ ఎజెండాను గోప్యంగా అమలు చేస్తూ వచ్చిన మోడీ షాల ద్వయం 2020 వచ్చే సరికి బహిరంగంగా అమలు చేయడం మొదలు పెట్టినట్టు కనపడు తున్నది. ఇది దేశానికి, హైదరాబాద్కు ప్రమాదం. విద్వేషాలు పెచ్చురిల్లితే మారణ హౌమం జరుగుతుంది. ఇటీవల ఢిల్లీలో ఏమి జరిగిందో చూసాం. గతంలో హైదరాబద్లో జరిగిన అల్లర్లు, కర్ఫ్యూల చేదు అనుభవం ఉండనే ఉన్నది. ప్రాణ నష్టం ఆస్తి నష్టం తప్పా భావోద్రేకాలతో సాధించేది ఏమీలేదు. పైగా అభివృద్ధి కుంటు పడుతుంది. ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. పేద, మధ్య తరగతి వర్గాల జీవన విధానం దెబ్బతింటుంది. వారి బతుకులు దుర్భరం అవుతాయి. వ్యాపారాలు దెబ్బతింటాయి. ఈ అనుభవమూ హైదరాబాద్కు ఉంది. మళ్లీ అలాంటి పరిస్థితులను కోరుకుందామా..? స్వార్థ రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలను, విషాన్ని చిమ్మి ప్రజల మధ్య చీలికలు తెచ్చి ఓట్లు దండుకునే రాజకీయాలను సమర్థించి నష్టపోదామా..? ఆలోచించండి..
- పి.వి. శ్రీనివాసరావు
సెల్:9553955396