Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మధ్యప్రదేశ్ ధర్మ స్వతంత్ర విధేయక్ 2020'' పేరుతో శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఒక బిల్లును తయారు చేసినట్టు, దానిని అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదించనున్నట్టు ఆ రాష్ట్ర హౌమ్ శాఖ మంత్రి నరోత్తం మిశ్రా యిటీవల మీడియాకు చెప్పారు. ఆ పార్టీకి అసెంబ్లీలో గల బలంతో బిల్లు ఆమోదం పొందడం, చట్టంగా మారడం లాంఛనమే. ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, అసోం, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాంటి చట్టాలనే చేయడానికి పోటీ పడుతున్నాయి. అసెంబ్లీకి పోయే దాకా ఆగలేని ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఈ నెల 24న ఒక ఆర్డినెన్సును ఆమోదించింది. బీజేపీ ప్రభుత్వాలు తెచ్చిపెడుతున్న ఈ సామాజిక సమస్య మత సామరస్యతకు, దేశాభివృద్ధికి సరికొత్త సవాలుగా మారనున్నది.
యూపీ ఆర్డినెన్సులో, ఎంపీ బిల్లులో నిబంధనలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి తెలియకుండా చేసుకునే ముస్లిం-హిందూ వివాహాలను లవ్ జిహాద్ గానే పరిగణిస్తారు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టి పదేండ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. పెండ్లి చేసుకోదలిచిన ముస్లిం-హిందూ జంట రెండు నెలలు ముందుగా సంబంధిత జిల్లా కలెక్టర్/మేజిస్ట్రేట్కి దరఖాస్తు చేసుకోవాలి. ''మత మార్పిడి లేకుండానే పెండ్లి చేసుకుంటాం'' అని హామీ యివ్వాలి. సదరు హామీ పత్రం పైన ఇరు మతాల పెద్దలు కూడా సంతకాలు చేయాలి. అలాంటి దరఖాస్తు పత్రాలను కలెక్టరేట్వారు పబ్లిక్గా ప్రకటిస్తారు. ఇష్టపడిన వారు పెండ్లి చేసుకునే విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలా? అది వ్యక్తుల స్వేచ్ఛా, స్వాతంత్య్రా లను హరించడం కాదా? అలా బహింగంగా ప్రకటించబడిన జంటలను లవ్ జిహాద్ను అరికట్టేందుకు సంఘపరివార్ నియమించిన ప్రయివేటు సైన్యం నిఘా వేసి వెంటాడుతుంది.
ప్రేమ అనేది సహజమైన విషయం. నచ్చిన వారిని ప్రేమించడం, పెండ్లి చేసుకోవడం మానవ నైజం. సహజమైన, ప్రకృతిపరమైన ఈ నియమాన్ని బీజేపీ సహించదు. ఆ పార్టీ పెద్దలు ప్రచారం చేసే పురాణాల్లో పునరుద్దరించాలని చెబుతున్న వేద కాలంలో ప్రేమ వివాహాలను కీర్తించడం జరిగింది. ఆ మాటకొస్తే శకుంతల దుష్యంతుల గాంధర్వ (ప్రేమ) వివాహం వల్లనే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందనే ప్రచారం తెలిసిందే. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కూడా ప్రేమించి పెండ్లి చేసుకున్న వారు చాలామంది ఉండవచ్చు. కానీ వర్ణాశ్రమ ధర్మం పేరుతో సవర్ణ వివాహాలకే పరిమితం చేయడం హిందూత్వ శక్తులు చేస్తున్న పని. హిందూమతం రక్షణ పేరుతో మతాంతర వివాహాలను వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రేమించి పెండ్లి చేసుకుంటే దానిని ''లవ్ జిహాద్'' అనే ముద్రవేసి దాడి చేస్తున్నారు. ముస్లిం-హిందూ వివాహాలు మత మార్పిడి కోసమే జరుగుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు. అలాంటి వివాహాలను నిషేధించాలని కోరుతూ వేసిన పిటిషన్ని తిరస్కరిస్తూ అలహాబాద్ హైకోర్టు మత మార్పిడుల కోసమే పెండ్లి చేసుకొంటున్నారనే ఆరోపణ సరైందికాదని, నిరాధారమైందని కొట్టేసింది. ముస్లింలు హిందువులను పెండ్లి చేసుకునే కేసుల్లో కుట్ర గానీ, విదేశీ నిధుల ప్రమేయంగానీ లేవని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన 'స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)' తేల్చింది. అయినా ఆ ప్రభుత్వం ''లవ్ జిహాద్'' ముద్ర వేసి ముస్లిం-హిందూ వివాహాల నిషేదానికి ఆర్డినెన్సు తెచ్చింది.
అభివృద్ధి చెందిన దేశాల్లో 'ఇంటర్ ఫెయిత్' (వివిధ మత విశ్వాసుల మధ్య) వివాహాల పట్ల అంతగా ఆంక్షలు లేవు. కొన్ని ఉన్నా చెప్పుకోదగినంతవి కావు. ప్రపంచీకరణ యుగంలో దేశాల మధ్య, ఖండాల మధ్య అంతరాలు తొలగిపోతూ అన్ని విషయాలు లిబరల్ (సరళీకరణ) అవుతున్న నేపథ్యంలో వివాహాల మధ్య విశ్వాసాల గోడలు నిర్మించడం తగని పని. సార్వత్రిక మానవ హక్కుల డిక్లరేషన్ ఆర్టికిల్ 16 ప్రకారం జాతి, మతం, తెగ పరిమితులతో నిమిత్తం లేకుండా మేజర్ అయిన పురుషులు, స్త్రీలు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. భారత రాజ్యాంగం ఆర్టికిల్ 21 వ్యక్తిగత జీవితానికి, జీవన భద్రతకు భరోసా యిస్తుంది. మత ఆచరణ, మత ప్రచారం చేసుకునే హక్కును అనుమతించిన ఆర్టికిల్ 25 వివిధ మతస్థుల మధ్య వివాహాలను నిషేధించలేదు. అందువలన లవ్జిహాద్ పేరుతో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనవి. రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తామని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడడం బీజేపీ రాజకీయ విధానంగా మారిపోయింది. ఆ వైఖరినే దేశ భక్తిగా చెప్పుకుంటోంది.
మతాంతర వివాహాలను నిషేధించడం వలన వ్యక్తుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు, ఇష్టాయిష్టాలకు విఘాతం కలగడమే కాదు, మత సామరస్యానికి, దేశ అభివృద్ధికి కూడా నష్టమే. ప్రేమించి పెండ్లి చేసుకున్న వారి జీవితాలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. వారికి కలిగే సంతానం కూడా జన్యుపరమైన సమస్యలు లేకుండా శారీరకంగా, బౌద్ధికంగా ఎదిగే అవకాశాలు ఎక్కువ. ఇద్దరూ ఇష్టపడి పరస్పరం అర్థం చేసుకుని పెండ్లి చేసుకున్న వారికి ఒకరి మత విశ్వాసాలను ఒకరిపై రుద్దాలనే పట్టుదల పెద్దగా ఉండదు. తమ మతంలోకి మారితేనే పెండ్లి చేసుకుంటాననే వారు కూడా తమ పెద్దల వత్తిడి వలన ఆ విధంగా చేస్తుంటారు. కుటుంబ సభ్యులు, మత పెద్దల అదుపు ఆజ్ఞలు లేకపోతే యువతీ వయువకులు మరింత స్వేచ్ఛగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించే అవకాశం కలుగుతుంది. పెద్ద మతాల వారే పెద్ద మనసుతో చిన్న మతాల వారిని ఒప్పించే కృషి చేయాలి తప్ప అడ్డుగోడలు నిర్మించడం సరైందికాదు. ఇప్పటికే భారతదేశంలో మైనార్టీ మతాలకు రక్షణలేదనే అపవాదు ఉన్నది. ఇలాంటి చట్టాలు చేయడం ద్వారా అది మరింత బలపడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఆ విషయం కొన్ని దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలనూ ప్రభావితం చేయవచ్చు. అంతర్జాతీయ సమాజానికి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా దాపురిస్తుంది.
- ఎన్. నారాయణ
సెల్:9490300577