Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్వేగాలు రెచ్చగొట్టడం, విద్వేషాల్ని వెదజల్లడం, అబద్ధాలు వల్లించడంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారసరళి జుగప్సాకరంగా పరిణమించింది. ఎవరికి ఎవరు తీసిపోలేదు. ఎవరి పద్ధతిలో వారు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మర్యాద పరిధిని దాటిన మాటలు రువ్వుతున్నారు. విమర్శలు ఆహ్వానించదగినవే. కానీ వాటికి సంబద్ధత ఉండాలి. వ్యక్తీకరణలో సంయమనం అవసరం.
ప్రశ్నల పరంపర
జనాలు ప్రశ్నిస్తున్నారు, నేతలూ ప్రశ్నిస్తున్నారు. ఎవరికి వారు చార్జ్షీటు పేరుతో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆరోపణల్లోనూ, ప్రశ్నల్లోనూ నిజాలున్నాయి. అయితే ఎన్నికలవేళనే వాస్తవాలు గుర్తుకురావడం, కేంద్రం వైఫల్యాలు స్ఫురించడం వింత. బీజేపీని యాభై ప్రశ్నలు కాదు, వంద ప్రశ్నలయినా అడగొచ్చు. గత ఆరేండ్ల పాలనలో సకల రంగాలలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం మీద ఎన్ని ప్రశ్నలయినా కురిపించవచ్చు. ఎందుకంటే ఆ ప్రశ్నల్లో సంబద్ధత ఉంది. పచ్చినిజాలు ఉన్నాయి. అదే సమయాన ఈ ప్రశ్నలు ఇపుడే గుర్తుకు వచ్చాయా? అని విజ్ఞులో, సామాన్యులో అడుగుతారు. వాటికి జవాబు చెప్పాలి. ఇపుడయినా గుర్తించారు సరే, ఇకనైనా ఒక విధానం అంటూ ఉంటుందా అని కూడా అడుగుతారు. ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా విధానాలకు సంబంధించిన స్పష్టత కావాలి. ఇది లోపించినపుడు ప్రశ్నలు వినసొంపుగా ఉంటాయి గానీ, ప్రశ్నించేవారి నిజాయితీ, నిబద్ధత ప్రశ్నార్థకంగా నిలుస్తాయి.
కేంద్రం విధానాలపై నిరసన ఏది?
డీమానిటైజేషన్ కారణంగా ఇవాళ్టికీ జనాలు ఇబ్బందులు పడుతున్నారన్న వాస్తవాన్ని టీఆర్ఎస్ చెబుతున్నది. తొలుదొలుత ఈ చర్యని ఆహ్వానించిన వారిలో ఈ రాష్ట్ర అధినేత కూడా ఉన్నారు. కానీ ఆ విషయంలో తమ నిర్ణయం పొరపాటని ఏనాడూ ఒప్పుకోలేదు. కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలని వ్యతిరేకిస్తున్నారు. మంచిదే. కానీ వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తుంటే, తమది రైతుల పక్షం అనుకునే టీఆర్ఎస్ ఒక్క నిరసన ప్రదర్శన అయినా జరపలేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వామపక్షాలు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో వ్యవసాయదారులు రోజుల తరబడి రోడ్ల మీద బైఠాయించారు. కానీ టీఆర్ఎస్ మాత్రం కేవలం ప్రకటనతో సరిపుచ్చింది. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలని ప్రతిఘటించాలనే సంకల్పం వుంటే అందుకు తగిన క్రియాశీలత, ఉద్యమించే చొరవని ప్రదర్శించాలి.
కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచీ నిర్దిష్ట వైఖరి అంటూ లేదు. కేంద్రం విధానాలపై నిజమైన వ్యతిరేకత, విధానపరమైన నిబద్ధత ఉంటే 26, 27 తేదీలలో జరిగే సార్వత్రిక సమ్మెకు, రైతులు ఆందోళనలకు మద్దతు ఇవ్వాలి. కార్మికుల, రైతుల నిరసన గళాలతో గొంతు కలపాలి. బీజేపీ మీద, కేంద్రం మీద పోరాడటం అంటే మాటలు చెప్పడం కాదు, విధివిధానాలకు సంబంధించి స్పష్టమైన వైఖరి తీసుకోగల సైద్ధాంతిక దృక్పథం కావాలి. ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసించే తెగువ, క్రియాశీలత చూపాలి. వీటితోపాటు రాష్ట్రంలో రైతుల, కార్మికుల పక్షాన నిలబడాలి. కౌలు రైతులకు గల హక్కుల్ని గుర్తించాలి.
ప్రభుత్వరంగ సంస్థల్ని దివాళా తీయించే కేంద్రం విధానాలను ప్రశ్నించడం బాగుంది. ఎన్నికల సమయంలోనైనా నిజాలు మాట్లాడుతున్నందుకు సంతోషమే. కానీ మన దగ్గర సిర్పూర్ పేపర్ మిల్లు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో అనుసరించిన విధానాలు ఏమిటో గుర్తుకు తెచ్చుకోవాలి. కార్మిక లోకానికి అండగా ఉండే విధానాలకు శ్రీకారం చుట్టాలి. అపుడే ఇవాళ బీజేపీ మీద వేసే ప్రశ్నలకు జనం మద్దతు లభిస్తుంది. ఆలస్యంగానైనా నిజాలు మాట్లాడుతున్నందుకు సంతోషిస్తారు. తర్వాత కాలంలోనూ ఇదే వైఖరితో పాలకపార్టీ వ్యవహరించగలదని విశ్వసిస్తారు.
దృక్పథ రాహిత్యం
బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెప్పే చాలా పార్టీలు ఎన్నికల వేళ చెప్పే మాటలకు, ఇతర సమయాల్లో చెప్పే మాటలకు పొంతన ఉండదు. అధికారాన్ని సుస్థిరం చేసుకోడం, కాపాడుకోడం అనే లక్ష్యాలుగా వ్యూహాల్ని, ఎత్తుగడల్ని అనుసరించడమే తప్ప నిర్దిష్టమైన విధానం లేని పరిస్థితి కాదనలేని వాస్తవం. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా చెప్పే మాటలు, ఎన్నికల అనంతరం తేలిపోవడం చూస్తున్నాం. మత విద్వేషాల్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావడమనే వ్యూహంతో బీజేపీ కొనసాగుతున్నది. ఇందుకు భిన్నంగా మతసామరస్యం, లౌకికవిధానం, ప్రజానుకూల విధానాల సరళి మాత్రమే ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. 'సిసలయిన హిందువును' అని చెప్పుకోడం వల్ల, లేదా తన అనుయాయులతో చెప్పించడం వల్ల ఫాయిదా ఉండదు. మతం వ్యక్తిగతం. యాగాలు, పూజలు ఇంటికే పరిమితం కావడం శ్రేయస్కరం. కానీ హిందువులకు అనుకూలమని చెప్పుకోడం ద్వారా ఒరిగేదేం ఉండదు. పాలితులు ఏ మతం వారయినా, జనశ్రేయస్సుకు అనుకూలమైన విధానాలతో పాలన సాగించడం పాలకుల బాధ్యత. జనం బతుకుల్ని మెరుగుపరిచే విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలే తప్ప మత సంబంధిత అంశాలకు దూరంగా ఉండటం ప్రభుత్వాల విధి. ఈ స్పష్టత, నిర్దిష్టత కొరవడిన ఫలితమే, కొత్తగా తమకు తాము హిందువులకు అనుకూలమనే ప్రకటనలు ఇచ్చుకోవలసిన దుస్థితి అధికార పార్టీకి ఏర్పడింది. ఈరకంగా బీజేపీ పన్నిన వ్యూహంలో పాలకపార్టీ చిక్కుపడింది. ఫలితంగా విధానాల కన్నా విద్వేష పూరిత రాజకీయాలు పెచ్చరిల్లాయి. మత ప్రస్తావనలు పదేపదే వినిపిస్తున్నాయి.
మత రాజకీయాలు పెను ప్రమాదం
మతంపై, మతం పేరుతో విద్వేషాల్ని రెచ్చగొట్టే రాజకీయ పార్టీలపై నికార్సయిన వైఖరి ప్రతి రాజకీయపార్టీకి ఉండాలి. ఎన్నికల్లో గెలుపోటములు లక్ష్యంగా మెతకవైఖరిని అనుసరిస్తే అది పెను ప్రమాదంగా పరిణమిస్తుంది. ఉత్తర భారతంలో మతం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. అది జన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చింది. ఎవరు ఏం తినాలో, ఏం చూడాలో, ఎవరితో జత కట్టాలో కాషాయమూకలు నిర్దేశించే దుస్థితి నెలకొన్నది. మెజారిటీ మతస్థుల మనోభావాలు దెబ్బతింటున్నాయనే పేరిట ఓటర్ల సమీకరణని ఒక వ్యూహంగా అమలు చేస్తున్నది బీజేపీ. దీన్ని గుర్తించి ప్రతిఘటించే విధివిధానాలు రాజకీయపార్టీలకి ఉండాలి. బీజేపీ తెలంగాణలోకి రాదని, రాలేదని, ఒకటీ రెండు సీట్లతో చేయగలిగేదేమి లేదని అనుకోడం తగనిపని.
దీర్ఘకాలిక వ్యూహం
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపోటములు ఎలా వున్నా తమ వాచాలత్వం ద్వారా, దూకుడుతనం ప్రదర్శించడం ద్వారా టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయంగా నిలిచే పార్టీ అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నది కాషాయపార్టీ వ్యూహం. ఇందుకు అనువుగానే ఆ పార్టీ యంత్రాంగమంతా ఈ ఎన్నికల ప్రచారంపైన దృష్టి కేంద్రీకరించింది. ఫలితాల కన్నా ఈ ఎన్నికల ప్రచార ప్రభావం ద్వారా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోడం, విద్వేషభావాల్ని పెచ్చరిల్లజేయడం, మతప్రాతిపదికన విభజన మరింత పెరిగేలా చూడటమనే ప్రమాదకరమైన ఆట ఆడుతోంది కాషాయపార్టీ. కనుకనే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే తీరుగా జరిగే ప్రచారపు పెను దుష్ప్రభావాల గురించి ఆలోచనాపరులు ఆందోళన చెందుతున్నారు.
దారితప్పిన మీడియా-సోషల్మీడియా
హద్దులు దాటిన విద్వేషపూరిత ప్రకటనలకు మీడియా అంతగా స్థానం కల్పించకూడదు. హద్దులు, సరిహద్దులు అతిక్రమించని వైఖరి తీసుకునే స్థయిర్యం మీడియాకి కొరవడింది. టీఆర్ఎస్కు సానుకూలంగా ఉంటేనే సరిపోదు, కాషాయపార్టీకి సైతం సై అనకతప్పని పరిస్థితులు తెలుగునాట మీడియాలో పాతుకుపోయాయి. కనుకనే కాషాయశక్తుల విద్వేషపూరిత ప్రకటనలకీ ప్రముఖస్థానం లభిస్తున్నది. విద్వేషం తగదని, విధానాల ప్రాతిపదికగా ప్రచారం జరగాలన్న దృష్టికోణాన్ని ప్రతిపాదించడం మీడియా కర్తవ్యం. ఆ మాత్రపు వివేచన కొరవడటం ప్రధాన స్రవంతి మీడియా దైన్యాన్ని, దీనస్థితిని తెలియజేస్తున్నది.
బీజేపీ మాత్రమే కాదు, సంఘ్ పరివార్ శక్తులూ సోషల్ మీడియాలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అబద్ధాలని నిజాలనుకునేంత అందంగా ప్రదర్శిస్తున్నాయి. తటస్థుల్ని తమ వైపు తిప్పుకునే రీతిన దుష్ప్రచారం సాగిస్తున్నాయి. ఈ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కాదు, మొత్తంగా సమాజాన్ని చీల్చే రీతిన విశృంఖల ప్రచారం వెల్లువెత్తింది. ఈ ప్రచారపు ఉధృతిలో కొందరు కవులు, రచయితలు, జర్నలిస్టులు కూడా భాగస్వాములయ్యారు. జాగ్రత్తగా గమనిస్తే తెలుగు సమాజపు సాహిత్య, సాంస్కృతిక రంగాలలోనూ కాషాయ అనుకూల వ్యక్తులు, శక్తులు నిశ్శబ్దంగా విస్తరిస్తున్న సంగతి తెలుస్తుంది. సోషల్మీడియాలోని వ్యక్తుల కదలికలు చెప్పకనే చెబుతాయి. ఒక విధానమంటూ లేకపోతే సోషల్మీడియా వేదికగా జనం మెదళ్ళని కలుషితం చేసే విద్వేషపూరిత రాజకీయాల్ని నిలువరించడం సాధ్యం కాదు. ఈ సంగతి ఇవాళ తెలుగునాట అధికారంలో ఉన్న పార్టీ గుర్తించాలి. తాత్కాలిక ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక దృష్టికోణం అవసరాన్ని గమనంలో పెట్టుకోవాలి.
భావోద్వేగాల చెరలాట
హైదరాబాద్ నగర కార్పోరేషన్కు జరిగే ఎన్నికల ప్రచారం ఇంతటి తారాస్థాయిని అందుకోడం యాదృచ్ఛికం కాదు. దక్షిణ భారతదేశంలో బలమైన పట్టుకోసం ప్రయత్నిస్తున్న కాషాయ పరివారం వ్యూహం ఫలితమే ఈ దృశ్యం. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తన బలం, బలగం తగ్గలేదని నిరూపించుకోడం కోసం హౌరాహౌరీగా తలపడుతున్నది. వివిధ రాష్ట్రాల ఎన్నికల బరిలో నిలబడుతున్న ఎంఐఎం ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. కనుకనే బీజేపీ నేతలకు దీటుగా ప్రతిసవాళ్ళను విసురుతున్నది.
కాంగ్రెస్, వామపక్షాలు ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ పోరాటం రెండుపక్షాల మధ్యనే అనే దృశ్యాన్ని మీడియా ఫోకస్ చేస్తున్నది. ఇది టీఆర్ఎస్కు ఏ మేరకు లాభం చేకూరుస్తుందో గానీ విద్వేష రాజకీయాలది పైచేయి అయ్యే ప్రమాదముంది. భావోద్వేగాలతో ఆడే రాజకీయ చెరలాటలు జనాలకు మేలు చేయవు. విధానాలపై చర్చ కీలకంగా ముందుకు రావాలి. కానీ ఆ కోణం లోపించింది. వరద బాధితులకు అందించే సహాయం గురించి ఎవరికి వారు రెట్టింపు సంఖ్యలతో హామీలిస్తున్నారు. కానీ ఈ నగరంలో పేదలు, నిత్యం శ్రమించే వారు కనీస సౌకర్యాలతో, ఆత్మగౌరవంతో హాయిగా జీవించే పరిస్థితుల కల్పన గురించి చెప్పడం లేదు. నగరంలో చతికిలపడిన యూనివర్సిటీలు, పాడుబడిన గ్రంథాలయాల పునరుద్ధరణ గురించి ప్రస్తావనైనా లేదు. నాలుగు శతాబ్దాల పైబడిన నగర చారిత్రక వైభవాన్ని పరిరక్షించుకోవడానికి ఏం చేస్తారో చెప్పడం లేదు.
నగరం కేంద్రంగా జరిగే ఎన్నికలలో విధానాల స్పష్టత కొరవడి, ఉద్వేగపూరిత రాజకీయాలు చెలరేగడం విషాదం. అధికారం కైవసం చేసుకోడం లక్ష్యంగా ఆడే ఈ ఆటలో ప్రజలు తురుపుముక్కలేనా? ఒకవైపున విధానాల లేమి, మరోవైపున ద్వేషం పెంచే రాజకీయాల నడుమ ప్రత్యామ్నాయం ఎంచుకోడం జనాలకు పరీక్షగా నిలిచిన ఎన్నికల ఘట్టమిది.
- గుడిపాటి