Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ అవార్డు చిత్రాల దర్శకుడు నరసింహ నంది రూపొందిస్తున్న తాజా చిత్రం 'డిగ్రీ కాలేజ్'. వరుణ్ దివ్యరావు జంటగా శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్ర రెండో ట్రైలర్ని గురువారం విడుదల చేశారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు ట్రైలర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, 'ఇద్దరు డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మధ్య అంకురించిన యదార్ధ ప్రేమ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసాం. ఆ అబ్బాయి, అమ్మాయి క్లాస్ రూంలో, బయట ఎలా ప్రవర్తించారో ఆ అంశాలనే ఇందులో చూపించాం. ఆ మధ్య విడుదల చేసిన ఈ చిత్రం మొదటి ట్రైలర్కు విశేషమైన స్పందన లభించింది. రికార్డు స్థాయిలో లైక్స్ వచ్చాయి. అదే సమయంలో ట్రైలర్ని చూసిన కొంతమంది ఈ చిత్రానికి సెన్సార్ ఎలా వస్తుందో చూస్తాం అన్నట్లుగా మాట్లాడారు. కానీ సెన్సార్ నిబంధనల ప్రకారంగా ఇస్తారు. చాలా రోజులు సెన్సార్లోనే ఈ చిత్రం ఉండిపోయింది. ప్రాంతీయ సెన్సార్ బోర్డులో సెన్సార్ పరంగా సమస్య ఎదురు కావడంతో రీవైజింగ్ కమిటీకి ఈ చిత్రాన్ని పంపడం జరిగింది. కేవలం రెండు దృశ్యాలను మాత్రమే కట్ చేశారు. ఇలాంటి కథను యధాతథంగా చూపించడానికి దైర్యం కావాలి అంటూ అందరూ ప్రశంసించారు. గతంలో నేను తీసిన సినిమాలకు అవార్డులు వచ్చాయి. కానీ ఈ చిత్రానికి రివార్డులు వస్తాయి. డిసెంబర్ మొదటి వారంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. 'ఇలాంటి చిత్రాలు యువతను చెడగొడుతున్నాయని కొందరు అంటున్నారు. కానీ రియల్ స్టోరీ ప్రేరణతోనే ఈ చిత్రాన్ని తీశాం. రొమాన్స్ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి' అని హీరో వరుణ్ తెలిపారు.