Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దిశా రవి.. ఇరవై రెండేండ్ల యువ ఉత్తేజం. ఆరోగ్య భారతం కోసం నడుం బిగించిన పర్యావరణ ఉద్యమకారిణి. ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో దేశద్రేహి అయ్యింది. దేశ భవిష్యత్ను బంధించి జైలుగోడల మధ్య అణగదొక్కాలని చూస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటి... మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులకు బాసటగా నిలవటమే ఆమె చేసిన దేశద్రోహం. పాలకుల వెన్నులో వణుకు పుట్టించినా ఈ ఆధునిక యువ కెరటం గురించి మరిన్ని విశేషాలు ఈ వారం మానవిలో...
దిశా... కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరులోని ఓ రైతు కుటుంబంలో పుట్టింది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో బీబీఏ డిగ్రీ చదువుతున్నది. 2018లో గ్రేటా థన్బర్గ్ పర్యావరణ పరిరక్షణ దిశగా 'సేవ్ ది ఎన్విరాన్మెంట్ క్యాంపెయిన్'తో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టిస్తున్న సమయంలోనే దిశా రవి 'ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా' ప్రచారం మొదలుపెట్టింది. భారత్లో వాతావరణ మార్పుల నియంత్రణకు నిర్వహిస్తున్న చాలా ఉద్యమాలు, కార్యక్రమాల్లో ఈమె పాల్గొన్నది. ఇదే అంశంపై గతంలో ఆమె బెంగళూరులో నిరసనలు కూడా చేపట్టింది. వాతావరణ మార్పులతో చుట్టుముట్టే ముప్పులపై వ్యాసాలు కూడా రాస్తుంది. చెరువులు, నదులను శుభ్రం చేయడం, చెట్లను నరక్కుండా కాపాడడం మొదలైన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆమె ఎక్కువగా ఇష్టపడుతుంది.
అత్యంత చిన్న వయసులోనే...
డిగ్రీ విద్యార్థిగా ఉన్న ఈమె ఒక వర్క్షాప్లో ఇచ్చిన ప్రజంటేషన్ అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయి భూమిని కాపాడడం గురించి ఇంత బాగా ఆలోచిస్తోందే అని విస్మయం కలిగింది. ఈమె ప్రతీ శుక్రవారం విద్యార్థుల్లో, చుట్టుపక్కల ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. జీవ కారుణ్యాన్ని కాంక్షిస్తుంది. ఇలా దిశారవి గురించి చెప్పుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి.
గొంతు నొక్కేస్తున్నారు
దిశా పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తున్న 'ఫ్రైడేస్ ఫర్ ప్యూచర్'పై కేంద్ర ప్రభుత్వం గతంలో ఎన్నో ఆంక్షలు విధించింది. ఆ సమయంలో దిశా ఓ వెబ్సైట్తో మాట్లాడుతూ ''భారతదేశంలో ప్రజా వ్యతిరేక చట్టాలకు జనం బలైపోతున్నారు. అసమ్మతి గొంతు నొక్కేస్తున్న దేశంలో మేము జీవిస్తున్నాం. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ముసాయిదాను వ్యతిరేకిస్తున్న కారణంగా 'ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ దేశానికి చెందిన వ్యక్తులపై తీవ్రవాదులనే ముద్ర వేస్తున్నారు. ప్రజల జీవితాలకన్నా లాభాలకు పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం స్వచ్ఛమైన గాలి, నీరు కోరుకోవడాన్ని తీవ్రవాదంగా పరిగణిస్తోంది'' అని అన్నది.
ఆమె చేసిన తప్పేంటి?
రైతు కుటుంబంలో పుట్టడంతో చిన్నతనం నుండే రైతులు పడే కష్టం ఏమిటో చూస్తూ పెరిగింది. కాబట్టే రైతులకు లాభాల వర్షం కురిపిస్తామంటూ కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల అసలు గుట్టు తెలుసుకుంది. అవి వ్యవసాయ చట్టాలు కావు కార్పోరేట్ వ్యాపార చట్టాలని గుర్తించింది. అందుకే ఆ నల్లచట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతాంగ ఉద్యమానికి మద్దతుగా నిలిచింది. మూడు నెలల నుంచీ దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి బాసటగా నిలవడం. అందుకే ఒక్కసారిగా ఆమె దేశద్రోహి అయ్యింది. ఫిబ్రవరి14న ఢిల్లీ పోలీసులు బెంగురూరు వచ్చి మరీ ఆమెను అరెస్టు చేశారు.
నిజాయితీతో పని చేస్తుంది
''దిశ చాలా చలాకీ అమ్మాయి. మంచి యువతి. కొన్నిసార్లు ఆమె కార్యక్రమాలకు ఆలస్యంగా వచ్చేవారు. కానీ, మేం ఏం అనేవాళ్లం కాదు. ఎందుకంటే ఆమె శక్తివంచన లేకుండా, చట్టాలకు అనుగుణంగా, నిజాయితీతో పనిచేస్తుంది. 'సేవ్ ట్రీస్' (చెట్లను కాపాడండి) ఉద్యమం గురించి తనే స్వయంగా పోలీసులకు వివరించి వారి అనుమతి తీసుకున్నారు. దిశ ఎప్పుడూ చిత్తశుద్ధితో చట్టాలకు లోబడే పనిచేశారు'' అంటూ మరికొందరు స్వచ్ఛంధ కార్యకర్తలు అంటున్నారు.
పెట్టిన కేసులు ఏంటి?
భారతీయ శిక్షా స్మృతిని అనుసరించి దేశ ద్రోహం, సమాజంలో వివిధ వర్గాల మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, నేరపూరిత కుట్రల కింద దిశపై కేసులు నమోదు చేశారు. దిశను కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ కూడా సీజ్ చేశారు. అయితే, దిశను కస్టడీకి పంపించాలనే నిర్ణయం తీసుకొనే సమయంలో ఆమె తరపు లాయర్ కోర్టులో లేకపోవడంపై నిపుణులు నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. లాయర్ లేని సమయంలో ఆమెను పోలీసు కస్టడీకి పంపించండంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఎంతో మంది ఈ అక్రమ అరెస్టును వ్యతిరేకించారు.
టూల్ కిట్ అంటే ఏమిటి?
టూల్ కిట్ అంటే ఆయుధాలు కావు. ''టూల్కిట్ అనేది ఒక పత్రంలాంటిది. పరస్పర సహకారం, సమన్వయంకోసం ఉపయోగించేది. దీన్ని ఎవరికీ వ్యతిరేకంగా ఉపయోగించరు. ఎవరైనా ఎక్కడినుంచైనా గూగల్ డాక్యుమెంట్ ఎడిట్ చెయ్యొచ్చు. అందరి ఆలోచనలను అందులో పొందుపరిచి.. అన్నీ ఒకేచోట ఉండేలా చేయొచ్చు. దీన్ని ఎవరు ముందు సవరించారు, ఎవరు తరువాత సవరించారు అనే విషయాలేం తెలీవు. ఇది డిజిటల్ ప్రపంచం. ఎవరైనా ఎక్కడి నుంచైనా ఎడిట్ చెయ్యొచ్చు. నిజం చెప్పాలంటే వయసు పైబడినవాళ్లు, వృద్ధులు ఈ దేశాన్ని నడుపుతున్నారు. వారికి టెక్నాలజీ గురించి ఏమీ తెలీదు'' అని తారా కృష్ణస్వామి అంటున్నారు.
చట్టాలను ఉల్లం ఘించలేదుపర్యావరణ పరిరక్షణ కోసం మేము చేపట్టే వివిధ కార్యక్రమాల గురించి అనేకసార్లు మాట్లా డుకున్నాం. వ్యక్తిగతంగా దిశారవితో నాకు పరిచయం లేదు. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఆమె ఎప్పుడూ చట్టాన్ని ఉల్లంఘించలేదు. ఒక్కసారి కూడా అలాంటి పని చేసిన దాఖలాలు లేవు. ఇదొక్కటే కాద, అనేక ఉద్యమాలకు సంబంధించిన సంస్థలన్నీ కూడా చట్టబద్ధంగానే పనిచేస్తాయి. దిశ ఎప్పుడూ వాటన్నిటికీ నిజాయితీగా, శాంతి యుతంగా సహకరిస్తారు.
- తారా కృష్ణస్వామి,
సామాజిక కార్యకర్త, బెంగుళూరు
దిశకు మద్దతుగా...
వీగన్ మిల్క్ (పూర్తి శాకాహార పాలు) ప్రోత్సహించే ఒక స్టార్టప్ కంపెనీలో దిశా రవి పనిచేస్తుంది. ''దిశ ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. ప్రస్తుతం తన కుటుంబం తన సంపాదన మీదే నడుస్తోంది. చాలా చిన్నప్పటినుంచీ ఆమె కుటుంబం నాకు బాగా తెలుసు. ఆమె తండ్రి ఆరోగ్యం బాగోలేదు. తల్లి గృహిణి. కొద్ది రోజుల ముందు పొద్దున్న ఏడు గంటల నుంచీ తొమ్మిది వరకూ, మళ్లీ సాయంత్రం ఏడు నుంచీ తొమ్మిది వరకూ చేయగలిగేలా ఏదైనా పని ఉంటే ఇప్పించమని ఆమె నన్ను అడిగారు'' అని ఆ స్టార్టప్కు చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ''ఇది చాలా విచారకరం. నిరాశ నిస్పృహలను కలిగిస్తోంది. చెట్లను, పర్యావరణాన్ని కాపాడాలనుకునే పిల్లలను దేశ ద్రోహులుగా చిత్రీకరించి భయపెడుతున్నారు'' అని మరొక కార్యకర్త తెలిపారు. ఈ విధంగా ఎంతో మంది ప్రముఖులు దిశకు మద్దతుగా నిలబడ్డారు.