Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుండి ప్రతిపక్షనేత చంద్రబాబు సహా 12మంది టీడీపీ సభ్యులును స్పీకర్ సస్పెండ్ చేశారు. ఏపీ శాసనసభ సమావేశాల్లో తొలిరోజే గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. తుఫాను పరిహారంపై చర్చ సందర్భంగా అధికార పక్షం తీరును నిరసిస్తూ టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పీకర్ పోడియం ముందు నేలపైనే బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. తుపాను పరిహారంపై జరిగిన చర్చలో టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానమిచ్చారు. దానిపై మాట్లాడేందుకు చంద్రబాబు యత్నించగా అధికార పక్ష సభ్యులు అడ్డుతగిలారు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై మండిపడుతూ టీడీపీ సభ్యులతో కలిసి స్పీకర్ పోడియం ముందు భైఠాయించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు కావాలనే పోడియం ఎదుట బైఠాయించారని ఆరోపించారు. రౌడీయిజం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారంటూ టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్, బెందాళం అశోక్, మంతెన రామరాజు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, వేగుళ్ల జోగేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ వేసినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.