Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ వచనకవితా రంగంలో సిధారెడ్డిది ప్రత్యేక స్థానం. వివిధ పోరాటాల, ఉద్యమాల నేపథ్యంలో రూపొందిన వ్యక్తిత్వం ఆయనది. అధిక ప్రమాణంలో రాసి, రాశులు పొయ్యాలనేది ఆయన ధోరణి కాదు. ఆయన మాట ఏదైనా నాభి నుంచి పలికినదే. ''సభలో ఒకటి, స్వగతం ఒకటి'' లాంటి కపటాలను నిరసిస్తాడు. నిజాయితీ, ఆర్తి ఆయన కవిత్వానికి ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసలు. ఆయన ఉపయోగించే భావచిత్రాలు, ప్రతీకలు, అన్ని స్థాయిల వారికి అనుభూతమయ్యే విధంగా ఉంటాయి. తెలంగాణ గ్రామీణ ప్రజల కవితాత్మకమైన నుడికారాన్ని సొంతం చేసుకున్న కవి సిధారెడ్డి. తెలంగాణా ప్రజల ఆరాటాలకు, పోరాటాలకు పర్యాయపదం ఆయన కవిత్వం. ధిక్కారం ఆయన కవిత్వ స్వభావం. సౌందర్యం ఆయన కవిత్వం సహజాతం.
''భూమి స్వప్నం'' నుంచి ''ఇక్కడి చెట్ల గాలి'' వరకు ఏడు కవితాసంపుటాలు ప్రచురించారు. ఆ వరుసలో ''నీటిమనసు'' ఎనిమిదవ కవితాసంపుటి.
''నా పుట్టువడే స్వప్నం
కరిగితే కవి
పారితే నది
కవిది నది అవతారం
నాకు రెండూ తెలుసు
నీటిమనసు, నీటి సొగసు!''
అంటూ ''భూమిస్వప్నం'' తోనే తాను కవిగా అవతరించిన అంశాన్ని స్ఫురింపజేశాడు. వ్యవసాయ క్షేత్రాలను సస్యశ్యామలం చేసినప్పుడే నదికి సార్థకత. కరిగిన కవి ఆర్తి ప్రజల మనోక్షేత్రాలను చేరినప్పుడే కవిత్వానికి సార్థకత. ''నీటి యొక్క మనసు'' అనీ, ''కరిగి నీరైన కవి మనసు'' అనే రెండు అర్థాలూ ''నీటిమనసు'' అనే శీర్షికకు అన్వయిస్తాయి.
ఈ సంపుటిలోని ''ఊరి నెత్తురు'' అనే కవిత కీలకమైనది. ''వసంతమేఘం గర్జిస్తుంటే/ వసంతం వచ్చినట్టే పరవశించిన/ గర్జించిన మేఘం చెప్పాపెట్టకుండ తరలిపోయింది!/ చెట్లు చిగురించక ముందే / పూలు పూయక ముందే వసంతం వెళ్లిపోయింది!'' అని సమీప గత, వర్తమాన రాజకీయ పరిణామాలను వాస్తవికదష్టితో సూచించాడు. ''అక్షరమంతా అమరత్వమే అయితే జీవితమేం కావాలి?'' అని ప్రశ్నించాడు. ''నీళ్ళ కోసం మొహం వాచిన వాణ్ణి/ నది తారసపడితే/ చేతులు చాచి ఆలింగనం చేసుకున్నా!'' అంటూ చాల గొప్పగా, తెలంగాణ ఆరాటాన్నీ, పోరాట లక్ష్యాలనూ పరోక్షంగా తెలిపాడు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్నీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునూ, ప్రజల ఆకాంక్షలనూ సూచించే వాక్యాలివి. ఇక్కడ ''నది'' ఉద్యమానికి, ఉద్యమనాయకుడికి కూడ సంకేతమే. తెలంగాణ ఉద్యమంతో తన మమైకత్వానికి కారణాలను, లక్ష్యాలను కూడ గుప్తంగానే అయినా కవి స్పష్టంగానే చెప్పాడు. తెలంగాణకు సమకూరాల్సిన తక్షణ, శాశ్వత ప్రయోజనాలనూ వ్యక్తపరిచాడు.
నీళ్ళు, నిధులు, నియామకాల పరమైన అనివార్య మైన తక్షణ ప్రయోజనాలకోసం (''రాజ్యానిది బహుముఖ వ్యూహం'' అని గుర్తిస్తూనే), ఇక్కడి ప్రజల కోసం ''బతుకుకు భ్రమ కూడ అవసరమే'' అని వివరించాడు. ''ఊరు ఊపిరి తీసుకుంటే/ ఊరట పడుతున్నా!/ వరదగూడు కడితే వాన పడుతుందని ఊరు ముచ్చటపడితే/ ముచ్చట పెడుతున్నా!'' అనే మాటలు ఎంతో భావగర్భితమైనవి, నర్మగర్భమైనవి. ''ఊరు ఊపిరి తీసుకోవడం'' ఉద్యమ సాఫల్యానికి సంకేతం. తెలంగాణ తక్షణ ప్రయోజనాల సాధన విషయంలో ''ప్రజా స్వామ్యం'' పైన ఆశ పెంచుకోవాల్సిన అవసరాలను సూచించాడు.
''శరీరం కోసం/ భూమి వదిలిన వాడికి/ భూమి మీద ప్రేమ ఉన్నట్టా?/శరీరం మీద ప్రేమ ఉన్నట్టా?'' అని ప్రశ్నించాల్సిన వారిని, మార్మికంగానే అయినా, సూటి గానే, కటువుగానే ప్రశ్నించాడు. ఇక్కడ శరీరం ''ఉద్యమాని''కీ, భూమి ''తెలంగాణ''కూ ప్రతీకలని భావించవచ్చు. దీర్ఘ కాలిక పోరాటాలతో, విశాల ప్రయోజనాల కోసం, విప్లవాత్మక పరిణామాల కోసం జరిగే ఉద్యమాలకూ, నిర్దిష్ట ప్రదేశాలలోని తక్షణ, అనివార్య, అత్యవసర ప్రయోజనాలకూ మధ్య ఉన్న భేదాలను ఈ కవితలో కవి నర్మగర్భంగా చర్చించాడు. ''అలవాటయిన భాష/ అంతర్జాతీయం మాట్లాడు తున్నది!/ ఇక్కడి ప్రజలేం కావాలి?'' తన హదయాన్ని ఆవిష్కరించాడు. తన సందేహాన్ని ప్రశ్నాత్మకంగా నివేదించాడు. తాను ఎప్పుడూ ''బతుకు వైపే'' అని, తనది ''ఇక్కడి భూమిస్వప్నం'' అని నొక్కి చెప్పాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న విప్లవోద్యమ అభిమానుల అందరి మనోగతాన్ని కూడ ఈ కవిత ప్రతిఫలిస్తున్నది.
''నేను అడుగు తీసి అడుగు వేసిన చోటల్లా నది కావాలి!/ఆ నదుల్లో, నా నదుల్లో / జనులంతా స్నానం చేసే పంటపొలాలు కావాలి!'' (భూమిస్వప్నం) అని ఆనాడే ఆశించాడు. ''పాలు పడని పచ్చి బాలెంత లాంటి తెలంగాణ''ను చూసి బావురుమన్నాడు. ''నిండిన చెరువు ముందు'', ''వానపడని నేల మీద'', ''ఎండిన చెరువు ముందు'' (ఒక బాధ గాదు), ''బోరు దుఃఖం'', ''నీళ్ళకోసం'', ''దాహం'', ''కోమటి చెరువు'' (ప్రాణహిత) మొదలైన కవితలలో కూడ (గతంలోనే) నీటికోసం తెలంగాణ రైతుల తండ్లాటను ఆర్తితో చిత్రించాడు. ''వాక్పర్యంత స్వప్నం తలపుతో నేల వాలింది'' -తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమయ్యింది. ''తరలి వచ్చిన నది కడుపు నింపుతుంది'' అని కలగన్నాడు. నీటికోసం కలగంటున్న నేల భూమి నుంచి మాట్లాడు తున్నానని తన స్థల కాలాల నేపథ్యాన్ని మరోసారి వివరించాడు.
''సహజాతం'' అనే కవితలో తన వ్యక్తిత్వాన్ని గుప్తంగా నిక్షిప్తం చేశాడు. సముద్రానికి గాంభీర్యం తోపాటు ఎగిసిపడే లక్షణమూ ఉంటుంది. వైశాల్యం, సహనం భూమి స్వరూప, స్వభావాలు. చెట్టుది ఉదారగుణం. ఈ లక్షణాలన్నీ సిధారెడ్డికీ వర్తిస్తాయి. సమస్త ప్రకతికీ, వివిధ కాలాలకూ, సకల సమాజాలకూ ప్రతినిధి ఆయన కవిత్వం. ''సిధారెడ్డి అందరికీ అందుతాడు/ ఎవరికీ అందడు!''. అందరికీ అందుబాటు లో ఉండే నిరహంకార, నిరాడంబర మూర్తి ఆయన. అలాగే ప్రతికూల విమర్శకులకు ఎవరికీ అందడు. ఒక కోపం, ఒక ఓపిక, ఒక ఆర్తి, ఒకింత సాహసం, అనివార్యమైనప్పుడు ఒకింత రాజీ....ఇదీ ఈ కవి తత్వం. ''ఇటీవల సిధారెడ్డి మారాడు'' అనే కొందరి ఆక్షేపణలకు ''సిధారెడ్డి మారడు'' అని కచ్చితంగా చెప్పాడు.
''లోకనం'' అనే కవిత ఇతరులను సంబోధించి చెప్పినట్లు బయటికి కనిపిస్తుంది. కాని, అది తనను తానే సంబోధించుకున్న స్వగతమని గుర్తించడం కష్టం కాదు. తనను ప్రతికూల దష్టితో విమర్శించేవారు, అసూయాగ్రస్తులు కొందరు ఎప్పుడూ ఉన్నారన్న ఎరుక ఉన్న కవి ఈయన.
నగరానికి సంబంధించిన ధనాంశాలనూ, రుణ అంశాలనూ కొన్ని కవితలలో వర్ణించాడు. జీవిక కోసం నగరానికి వలస వచ్చే కష్టజీవుల తొక్కులాటలను సహజ సుందరంగా చిత్రించాడు. విమాన ప్రయాణ అనుభూతులను అక్షరీకరించాడు. వివిధ కవితలలోని, వాక్యాలలోని నాదసామ్యం కలిగిన పదాల కూర్పు, జంట వాక్య విన్యాసాలు, అప్రయత్నకతంగా అమరిన పదాల పేర్పు సిధారెడ్డి శైలిని పట్టి చూపుతాయి. వివిధ భావాల సమ్మిశ్రితమైన మానసిక స్థితిని రూపు కట్టించిన ఇతర కవితలు కూడ పేర్కొనదగినవి. నేలను వదలనిది, తడి తడి గుణం విడువనిది ఆయన కవిత్వం. సంఖ్యా ప్రసిద్ధి కంటే, సారాంశ సిద్ధి ముఖ్యమని భావించే కవి సిధారెడ్డి.
- పెన్నా శివరామకష్ణ, 94404 37200