Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి అనగానే ''తెలుగు కథానిక - స్వరూప స్వభావాలు'' సిద్ధాంత గ్రంథం గుర్తుకొస్తుంది. కథానికా ప్రక్రియకు సంబంధించి సాహిత్యశాస్త్రం అంతగా రూపొందని సమయంలో, దాని పుట్టుపూర్వోత్తరాల గురించి సమగ్రమైన పరిశోధన చేసినవారు పోరంకి వారు. అది తెలుగు కథానికా సాహిత్య శాస్త్రంలో మొట్టమొదటి సిద్ధాంత గ్రంథం. ఆ గ్రంథాన్ని రాస్తున్న సమయం నుంచి పోరంకి వారితో నాకు పరిచయం. విహారి-శాలివాహన కథానికా సంపుటి ''పళ్ళచక్రం'' గురించి వారు తమ సిద్ధాంత గ్రంథంలో విశ్లేషణాత్మకంగా పేర్కొన్నారు.
దేశవిదేశాల్లో అనన్యసామాన్య ప్రచారం పొందిన పరమహంస యోగానంద వారి ''ఒక యోగి ఆత్మకథ'' గ్రంథాన్ని పోరంకి వారు తెలుగులోకి అనువదించారు. ఈ గ్రంథం 20 ఏళ్ళలో 25 ముద్రణలు పొంది, కొన్ని వేల ప్రతులు అమ్ముడుపోయాయి. పాఠకుల విశేష ఆదరణని పొందింది. ఇదికాక పోరంకి వారు జస్టిస్ పమిడిఘంటం కోదండరామయ్య గారి ''ది లైట్ ఆఫ్ రామాయణ'' అనే విశిష్ట గ్రంథాన్ని ''రామాయణ ప్రభ'' పేరుతో అనువదించారు. ఇది కూడా పోరంకి వారికి అపూర్వమైన ప్రశంసల్ని, అభినందనలల్నీ తెచ్చిపెట్టింది. ఇవిగాక, ''మన ఆధ్యాత్మిక వారసత్వం'' వంటి అనువాద గ్రంథాలు, శతాధికమైన మౌలిక ఆధ్యాత్మిక వ్యాసాలు, వారి మేధా సంపత్తికి తార్కాణంగా వెలువడినాయి. 1914లో వెలువడిన గురజాడ వారి ''మినిట్ ఆఫ్ డిసెంట్'' గ్రంథాన్ని తెలుగులోకి అనువదించి, 1964లో ఆంధ్రప్రభలో ధారావాహిక తొలిసారిగా ప్రచురించింది పోరంకి వారే! 1928లో అది పుస్తక రూపంగా విశాలాంధ్ర ప్రచురణగా వచ్చింది. 90 ఏళ్ల తర్వాత డాక్టర్ వేదగిరి రాంబాబు పునర్ముద్రించారు. తెలుగు భాషోద్యమ కారులకు తోడుదీపం వంటి డిసెంట్ పత్రం ఈ విధంగా మళ్లీ వెలుగు చూడటం ఒక సాహిత్య అవసరాన్ని, సామాజిక అవసరాన్ని నెరవేర్చింది. దక్షిణామూర్తి గారికి నవలాకారుడుగా ఇతరులకు లేని ఒక అపూర్వమైన, ప్రతిష్టాత్మకమైన ప్రత్యేకత కూడా ఉన్నది. తెలుగులో తొలిసారి కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ మాండలికాల్లో విడివిడిగా ''వెలుగు వెన్నెల గోదారి'', ''ముత్యాల పల్లకి'', ''రంగవల్లి'' అనే మూడు నవలలు రాశారు. వారివి ''నివేదన'', ''నీడలు-జాడలు'' అనే మరో రెండు నవలలూ ఉన్నాయి. 1956 నుండి కథా రచయితగా పోరంకి వారు సుప్రసిద్ధులు. ఐదు దశాబ్దాల తర్వాత వారి మొట్టమొదటి కథానిక సంపుటి ''చంద్రవంక'' వెలువడింది. వారి కథానికలు అన్నిటా సార్వకాలికమైన, సార్వజనీనమైన ఆదర్శం, ఒక స్వచ్ఛమైన అభ్యుదయ ఆకాంక్ష కనిపిస్తాయి. పాఠకుడిలో ఉత్తమ మానవతా విలువల్ని ప్రేరేపింపచేసి, బతుకు అర్థాన్ని విడమరిచి చెబుతూనే, జీవనాన్ని జాగతి చేయగలగడం, మనిషి పట్ల, మానవత పట్ల వారికి గల నిబద్ధతను తెలియజేస్తాయి. పోరంకి దక్షిణామూర్తి గారు 1935 డిసెంబర్ 24వ తేదీన తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో జన్మించారు. తెలుగులో పట్టభద్రులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పొందారు. భాషాశాస్త్రాన్ని శాస్త్రీయంగా అభిలషించారు. 1957లో హైదరాబాదులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించినా, లెక్కలు రాస్తూ ఉండటం తన జీవిత పరమార్ధం కాదనిపించి, 1962లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పండితారాధ్యుల నాగేశ్వరరావు నెలకొల్పిన ''ప్రజాప్రభ''లో ఉపసంపాదకులుగా చేరి, ఆరు నెలలు మాత్రమే పని చేయగలిగారు. అది అప్పుడు ఆగిపోయింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కోసం ఆచార్య భద్రిరాజు కష్ణమూర్తి గారి నేతత్వంలో మాండలిక వత్తిపదకోశ నిర్మాణ పథకంలో పర్యటన పరిశోధకులుగా, సహాయసంపాదకులుగా పనిచేశారు. ఆ తరువాత కొంతకాలం లెక్చరర్గా పనిచేశారు. 1968లో తెలుగు అకాడమీలో చేరి, అనేక పదవులు నిర్వహించి, 1993 చివర అకాడమీ ఉపసంచాలకులుగా పదవీ విరమణ చేశారు.
వ్యక్తిగా దక్షిణామూర్తి గారు మదుభాషి, సౌజన్యమూర్తి. ''ప్రపంచంలో ఎవరి బతుకు వాళ్లది. ఎవరి దారి వాళ్ళది. ఆశయాలు, ఆదర్శాలు, అలవాట్లు ఎవరివి వారికి ఉంటాయి. మనకు అసంతప్తులు అన్నిచోట్లా కనిపిస్తూనే ఉంటాయి. అటువంటప్పుడు ఒక మంచిమాట, ఆప్యాయమైన ఒక పలకరింపు, కొంత సానుభూతి, మరికొంత మంచితనం, చేతనైన సాయం, లేనప్పుడు ఉపాయం అందిస్తూ, మనసు నిండిన ఆదరణ చూపడానికి అందరూ ప్రయత్నిస్తే- ఈ సమాజం ఇంతకంటే అందంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది కదా!'' అనేది దక్షిణామూర్తి గారి సదాశయం, సుమనోవాంఛ.
డాక్టర్ వేదగిరి రాంబాబు కథానిక శతజయంతి ఉత్సవాలు విజయనగరంలో మొదలెట్టి, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 23 జిల్లాల్లో అనేక కార్యక్రమాలు జరిపినప్పుడు- ఆయన వెంట నేనూ, దక్షిణామూర్తి, సుధామ, కొంపెల్ల శర్మ వంటి వాళ్ళం అనేక ప్రదేశాలకు, అనేక వ్యయప్రయాసలకు లోనై వెళ్లడం, రాంబాబుకు వెన్నుదన్నుగా నిలవడం, నా మనసులో చెరగని జ్ఞాపకం. ఆ సందర్భంలో మేము జరిపిన పర్యటనల్లో చివరికి రిజర్వేషన్ లేని బోగీలోకి ఎక్కి, రాత్రంతా నిద్ర లేకుండా కూర్చుని ప్రయాణం చేయటం వంటి సంఘటనలు తలచుకుంటే దక్షిణామూర్తి ఎంత నిగర్వియో, ఎంత ప్రశాంత మనస్కులో, వారిది ఎంత సహకార గుణమో, ఔదార్యమో తెలుస్తుంది.
డాక్టర్ పోరంకి వారికి ప్రతిష్టాత్మక బహుమతులు, సత్కారాలు, పురస్కారాలు, కొన్ని లభించాయి. అయితే ''బిరుదులు, బహుమతులు వంటివి సఫలమైన జీవితానికి కొలబద్ద కాదు. అని నా నమ్మకం. అవి 'నేను-నాది' అనే వాటి నోరు మూయించి, 'మనం-మనది' అనే భావాన్ని నిలుపుతుంటే, చూపు విశాలమవుతుంది. హదయం అమతకలశం అవుతుంది,'' అని తన జీవిత ఆశయాన్ని చెబుతూ, మరో మాట కూడా అన్నారు: ''అన్ని రంగాలలోనూ శక్తివంచన లేకుండా పని చేసేవాళ్ళు ఎంతో కొంత మంది ఉంటారు. వాళ్లు సాధించిన ఫలితాలు గొప్పవి అనే ప్రశ్నకు తావు లేదని నా అభిప్రాయం. ఫలితాలను ఎవరూ సాధించరు. చిన్న పనులకు కొందరికి ఫలితాలు వస్తాయి అంతే'' అన్నారు ఒక ఇంటర్వ్యూలో.
దక్షిణామూర్తి గారికి భార్య వరలక్ష్మి, ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్లంతా వాళ్ళ, వాళ్ళ పిల్లాపాపలతో వర్ధిల్లుతూ ఉన్నారు. తెలుగు భాషా సాహిత్యాల ప్రాంగణంలో తమ రచనలతో వన్నె చిన్నెల రంగవల్లులు దిద్దిన డాక్టర్ పోరంకి వారి మరణం సాహితీలోకానికి తీరని లోటు.
- విహారి,
9848025600