పొద్దున్నే తమ పుస్తకాల షాపును ఊడుస్తున్న శోభకు నోట్ పుస్తకాల కట్టల మధ్య పడుకొని శంకరన్న కనిపించాడు. ఎప్పటి తీరే పెద్దబాలశిక్షను తలకింద దిండులా పెట్టుకొని గాఢనిద్రలో ఉన్నాడు. పెద్దబాలశిక్ష అంటే శోభకు ఎంతో యిష్టం. సమయం దొరికినప్పుడల్లా ముందేసుకుంటుంది. ఈయనేమో మరేదీ దొరకనట్లు తలకింద పెట్టుకుని పడుకుంటాడని మనసులో అనుకుంటూ మరోవైపు శుభ్రం చేసింది.
కోరుట్ల ఓ మామూలు పట్టణం. శోభ అత్తగారిల్లు అక్కడే. భర్త రమేష్కు మెయిన్ రోడ్ పక్కనున్న వీధిలో సొంత ఇల్లు ఉంది. అందులోనే ముందుగదిలో స్టేషనరీ షాపు, వెనుక రెండు చిన్న గదుల్లో కుటుంబవాసం. ఇంటి వెనుకవైపు బావి, చిన్న పెరడు, ప్రహరీగోడ, దానికో మూలన పాతకాలపు తలుపు అన్నీ చిన్న కుటుంబానికి సరిపోయేలా ఉన్నాయి.
ఇలా శంకరన్న అప్పుడప్పుడూ రావడం, దుకాణంలో పుస్తకాల మధ్య పడుకోవడం శోభకు కొత్తకాదు. ముందు వింతగా తోచినా తర్వాత అలవాటైంది.
మొదటిసారి చూసినప్పుడు భర్తతో ఈయనెవరు అని అడిగితే బొంబాయిలో ఉండే మా మేనమామ కొడుకు, కరీంనగర్లో చదువుకుంటుండు, ఏదైనా పనిపడ్డప్పుడు, చూడబుద్దయినప్పుడు వస్తడు అని చెప్పిండు. శంకరన్నను ఓ సారి శోభకు పరిచయం చేసినా, ఆయనెప్పుడూ చుట్టంలా ఆమె మనసులో ముద్ర పడలేదు. వచ్చినప్పుడు మాత్రం బాగున్నావా చెల్లే అని పలకరిస్తే పెదాలపై చిరునవ్వుతో బాగున్నానని తల ఆడించడం శోభకు అలవాటు. ఎప్పుడు వచ్చినా ఒంటరిగా కూర్చొని చదవడమో రాయడమో పనిగా పెట్టుకునే ఆయన ఉనికిని శోభ మరిచినట్లే ఉండేది. ఇంటిముందు మోటార్ సైకిల్ ఆగిన చప్పుడు విని గోడవారగా చూసిన శంకరన్న చెప్పాచెయ్యకుండా ఆ బండిపై వెళ్ళిపోతుంటాడు. బైక్ పై వచ్చినాయన ఇంట్లోకి వచ్చిందీ, ఈయన్ను పిలిచిందీ శోభ ఎప్పుడూ చూడలేదు. ఇది మాత్రం కొంత గందరగోళంలా అనిపించినా భర్తపై భారమేసి మరిచిపోయేది.
ఓ రోజు రాత్రిపూట తలుపు చప్పుడు కావడం, రమేష్ లేచి తీయంగనే శంకరన్న దుకాణం గదిలోకి వెళ్ళడం నిద్రలోనే గమనించింది శోభ. తెల్లవారుజామున ఆయన బాత్రూంపైపు వెళ్ళడం చూసి శుభ్రం చేయడానికి దుకాణంలోకి వెళ్ళింది. తలగడగా పెట్టుకున్న పెద్దబాలశిక్షను పక్కన బల్లపై పెట్టడానికి చేతిలోకి తీసుకుంది. చాలా బరువనిపించింది. ఈ మాత్రం పుస్తకం ఇంత బరువుందేమని బల్లపై పెట్టి తెరిచి చూసింది. శోభ గుండె గుభేల్మంది. పుస్తకం మధ్యలో పిస్తోలు ఉంది. సరిగ్గా రివాల్వర్ పట్టేంత సైజులో పేజీలను కత్తిరించి దాన్ని అందులో అమర్చారు. బెదిరిపోయిన శోభ ఆ పుస్తకాన్ని ఉన్న చోట పెట్టేసి ఏదో అనుమానం వచ్చినట్లు తమ దుకాణంలో అమ్మే పెద్దబాలశిక్షలను తెరిచి చూసింది. అవన్నీ మామూలు పుస్తకాలుగానే ఉన్నాయి. ఏమెరుగనట్లు బయటికి వచ్చేసింది.
బావి పక్కన కుర్చీలో కూర్చొని రమేష్, శంకరన్న ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇద్దరికీ చారు ఇస్తుంటే శోభ చేతులు వణుకుతున్నాయి. దగ్గరి చుట్టంలా పాత దోస్తులా కలుపుగోలుగా మెదులుతున్న శంకరన్న ఎవరో కొద్దికొద్దిగా అర్ధమవుతున్న కొద్దీ ఆయన్తో రమేష్కున్న సంబంధమేమిటో ఆలోచిస్తుంటే ఆమెకు ముచ్చెమటలు పోస్తున్నాయి.
ఆయన అలా వెళ్ళాడో లేదో రమేష్ను గట్టిగా తన శరీరంతో అదిమి పట్టుకుని ''నువ్వు చెప్పిందంతా అబద్ధం. ఆయన దగ్గర పిస్తోలు ఉంది, నేను చూసిన'' అంటూ శోభ పొంగుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయింది.
ఆమెను అలాగే పట్టుకొన్న రమేష్ విషయం ఎలా మొదలుపెట్టాలో ఆలోచిస్తుండగా తిరిగి శోభనే - ''నాకంతా అర్ధమైంది. నీకు అన్నలతో సోపతి ఉంది. మా నాయన అండ్ల తిరిగే పానం తీసుకున్నడట. నాది ఒంటరి బతుకు కావద్దు'' అని మరింత గట్టిగా రమేష్ను పట్టుకొని ఏడుపు లంఖించుకుంది.
దు:ఖంతో గుండె బరువు తగ్గిన శోభను కూర్చోబెట్టి రమేష్ - ''శంకరన్ననే మనల్ని కలిపిండు. ఆయన చూసిన సంబంధమే మనది. మనకు దగ్గరివారి ఇంట్లో పెళ్ళికెదిగిన అమ్మాయి ఉంది. ఆమెను పెళ్ళి చేసుకొని ఆ యింటి భారం తీర్చమని శంకరన్న చెప్పి నన్ను నిన్ను ఒకటి చేసిండు'' అని చెప్పాడు.
''శంకరన్న మంచోడే కావచ్చు, కానీ ఇంట్లకు రానిచ్చుడంటే మాటలా... ఇల్లు బుగ్గయిపోతది... నరకం... నరకం కంట కనపడ్తది' అంటూ వణికిపోతూ - ''ఆయన మనింటికి వచ్చుడు వద్దే వద్దు'' అంటూ మంకుపట్టు పట్టింది శోభ. సరేనన్న రమేష్తో ఒట్టేయించుకుంది.
ననన
ఈ ఎండాకాలంలో పెళ్ళయిన కొత్త సంసారం రమేష్ శోభలది. శోభ పుట్టి పెరిగిన వూరు కోరుట్లకు పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే మన్నెగూడెం. బొట్టు పెట్టి పుట్టింటికి పిలిచేవాళ్ళు లేరు. ఎన్ని సార్లు రమ్మన్నా తల్లి ఇల్లిడిసి రాదు. ఆ ఊర్లో వ్యవసాయం కన్నా బీడీ పరిశ్రమే పెద్దది. వీధుల్లో ఏ మూలకు చూసినా కత్తిరించగా మిగిలిన బీడీల ఆకు చెత్తనే. ఊర్లో ఉన్నప్పుడు తల్లితో పాటు శోభ బీడీలు చుట్టేది. ఊరు బడిలో చదివినప్పుడయినా, రోజూ కోరుట్లకు పోయి కాలేజీ చదువు చదివినా ఇద్దరూ బీడీలు చుడితే తప్ప ఇల్లు జరుగదు. ఇంటర్మీడియట్లో ఇంగ్లీషు, మరో సబ్జెక్టు తప్పడం, వాటిని గట్టెక్కించేందుకు రెండేండ్లు కష్టపడడంతో శోభకు చదువుపై మోజు తీరింది. తల్లికి తోడుగా బీడీలు చేయడమే తన జీవితం అనుకుంటుండగా రమేష్తో ఈ ఏడాదే ఆమెకు పెళ్ళయింది.
శోభ తండ్రి రాజలింగం సొంత ఊర్లోనే బీడీ కంపెనీలో గుమస్తాగా పనిచేసేవాడు. కార్మికులు తెచ్చిన బీడీలను లెక్క ప్రకారం పెద్ద గంపలో సర్దుకొని, ఆ గంపను పాత సైకిల్ ట్యూబులతో తన సైకిల్ వెనుక సీటుకు గట్టిగా కట్టుకొని కోరుట్లలోని హెడ్డాఫీసుకు రోజూ వాటిని అప్పగించడం ఆయన డ్యూటీ. నెలకు అయిదు వందల రూపాయల జీతం. కంపెనీలో ఉద్యోగం ఉండటంతో ఆయనకు దగ్గరి చుట్టం వీరమ్మతో పెద్దలు పెండ్లి చేశారు.
రాజలింగం మంచి పాటగాడు. ఎక్కడ పాటల పుస్తకం కనపడ్డా కొనుక్కొని సాధన చేస్తుండేవాడు. ఎక్కడ పదిమంది జమయినా అక్కడ రాజలింగం పాట ఉండవలసిందే. డ్యూటీ అయిపోయిందంటే పాటలే ఆయన లోకం. దాశరథి 'ఆ చల్లని సముద్ర గర్భం' నుండి గూడ అంజయ్య 'ఊరు మనదిరా' దాకా ఏ పాటైనా పాడగల దిట్ట ఆయన. బీడీ కార్మికుల సంఘం మీటింగుల్లో పాటగట్టి హుషారుగా పాడి ఊపందించేవాడు. ఆ వేదిక ఈ వేదిక అనకుండా అంతటా రాజలింగం పాట మార్మోగేది. జిల్లాలో ఎక్కడ మీటింగు జరిగినా ఆయన డ్యూటీ వేరొకరికి అప్పగించి బలవంతంగా తీసుకుపోయేవాళ్ళు.
ఓ రోజు రాజలింగం ఇంటికి నడిరాత్రిపూట కొందరు వచ్చి ''అన్నల పాటలు చాలా బాగా పాడుతున్నవట... వాళ్ళతో నీకు సంబంధమేమిటో తెల్వాలె'' అంటూ లాక్కొని జీపులో వెంట తీసికెళ్ళారు. నెత్తీనోరూ కొట్టుకుంటూ వీరమ్మ ఊర్లె పెద్ద మనుషులెవరింటికెళ్ళినా అబ్బో ఈ యవ్వారంలో వేలుపెడితే మా పని కూడా అయితదంటూ ఎవరూ ముందుకు రాలేదు. పొద్దున్నే వీరమ్మ కాళ్ళావేళ్ళా పడి సర్పంచ్ను వెంటేసుకొని కోరుట్ల స్టేషన్కు వెళ్ళింది. 'మాకేమీ తెలియదు - ఫిర్యాదు రాసీయండి వెతికి చూస్తాం' అని ఇన్స్పెక్టర్ అన్నాడు. మొక్కుబడిగా కాగితంపై జరిగిన విషయం రాసిచ్చి ఇంటిదారి పట్టారు.
రెండో రోజు రాజలింగం బస్సు దిగిండని ఎవరో చెబితే వీరమ్మ ఎదురుబోయింది. ఇద్దరి ఆసరాతో మెల్లమెల్లగా నడుస్తూ వస్తున్న రాజలింగం కనబడగానే పరుగున దగ్గరికి చేరింది. మొకం కందగడ్డోలె అడ్డం దిడ్డం అయింది. కాళ్ళు చేతులు పొంగినయి. దు:ఖం కడుపులోనే దాచుకున్న వీరమ్మ భర్తను ఇంటికి తీసుకుపోయి వేడినీళ్ళతో స్నానం చేయించింది. మంచంలో కూచోబెట్టి అన్నం తినిపించింది. అలసిన రాజలింగం అదే మంచంలో ఒరిగి నిద్రపోయిండు. తల కింద తువ్వాలు పెట్టి బీడీలు చేసుకుంటూ ఆయన ముందరే నేలపై కూర్చుంది వీరమ్మ.
పాటనే పానం మీదికి తెచ్చింది. మరి పాటలు పాడకుండా ఉంటడా... పాటనే ఆయన పానమాయె... పాట విన్నా, పాడినా లేగదూడ ఓలె చెంగలిత్తడు... పాడినందుకే ఇంతగనం కొడ్తరా... ఇదెక్కడి పాడు రాజ్యం అనుకుంటున్న వీరమ్మ కళ్ళలోంచి టపటప కన్నీళ్ళు రాలి చేట తడిసి పోయింది.
రాజలింగం ఆరోగ్యం కుదుటపడడానికి పదిహేను రోజులు పట్టింది. పనికి రావద్దు, మరొకర్ని పెట్టుకున్నామని కంపెనీ మనిషి చెప్పి వెళ్ళాడు. మీటింగులకు పర్మిషన్లు ఇస్తలేరు. ఆట పాట అన్నీ బందయినయి. పని పాట లేని బతుకు రాజలింగంకు సీసాలో వేసి మూత పెట్టినట్లుంది.
అన్న మీదికి మనసు పోయింది. రాజలింగం అన్న వెంకట్రాజం బొంబాయిలో సాంచాలు నడిపిస్తాడు. తమ్ముడూ బొంబాయి రారా, పని పైకం మంచిగుంటది అన్న మాటలు గుర్తుకచ్చినయి.
''బొంబాయి పోయి బతుకుదామె ఈరమ్మ... మా అన్నకు ఉత్తరం రాస్తా'' అన్నాడు. భర్త బాధ చూడలేక సరే అన్నది వీరమ్మ అన్యమనస్కంగానే. ఇక్కడి విషయమంతా కాగితమ్మీద రాసి ఊర్లెనే ఉన్న పోస్టు మాస్టర్ ఇంటికెళ్ళి కవరు కొని అడ్రసు రాసి బయట ఉన్న ఎర్రడబ్బాలో వేసిండు.
ఉత్తరాల కట్ట పట్టుకొని బయటకు వస్తున్న టప్పా రాములు ఏందోరు బావ ఎట్టచ్చినావంటే ఉన్న విషయమే చెప్పిండు రాజలింగం.
టప్ప రాములుకు ఊరంతా చుట్టాలే. రిబ్బెన్లు, మొలతాళ్ళు అమ్మే మల్లేషుతో మంచి దోస్తానా. పది పదిహేను రోజులకోసారి వచ్చే మల్లేషు వచ్చినప్పుడల్లా టప్పరాములుకు చాయె తాపి ముచ్చట్లు పెట్టి ఎవరెవరికి ఉత్తరాలు వచ్చినయో తెలుసుకునడం అలవాటు ఆయనకు.
ఈ సారి కూడా చారు తాగుతున్న రాములు చేతిలోంచి ఉత్తరాల కట్ట తీసుకుని ఒక్కొక్కటి తిరగేశాడు మల్లేషు. అందులో బొంబాయి నుండి వెంకట్రాజం తమ్ముడు రాజలింగంకు రాసిన ఉత్తరం ఉంది. రాములు కళ్ళు గప్పి ఆ ఉత్తరాల్ని మల్లేషు చాటుగా మడచి జేబులో వేసుకున్నాడు.
ననన
''సార్! మీరు బలితీసుకుందామనుకున్న మేక బొంబాయికి జారుకుంటున్నది. ఇగ మీ ప్రమోషన్ మళ్ళా ఎన్కకు పోయినట్లే''... అంటూ మఫ్టీలో ఉన్న మల్లేషు తను తీసుకు వచ్చిన ఉత్తరాల్ని ఆఫీసర్ ముందు పెట్టాడు.
తాగుతున్న టీ గ్లాసును టేబుల్పై పెట్టి ఉత్తరం చదివాడు ఇన్స్పెక్టర్. తన సిఐ పదవికి మళ్ళీ గండం ఎదురు కావడంతో ఆగలేక ఆ రాత్రికే ముహూర్తం ఖరారు చేశాడు.
అర్ధరాత్రి తలుపులు దబదబ బాదడంతో నిద్రలోంచి లేస్తూ వచ్చి తలుపులు తెరిచింది వీరమ్మ. రాజలింగం గాడేడి అంటూ నలుగురు ఇంట్లోకి చొరబడ్డారు. కనబడక పోవడంతో ఇల్లంతా చిందరవందర చేశారు. తలుపుల చప్పుడుకు సంగతి గ్రహించిన రాజలింగం అప్పటికే ఇంటి వెనుక తలుపు తీసుకొని బయటపడ్డడు. 'ఎంత దూరం పోతడు కొడుకు' అని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఏడ్చుకుంటూ వీరమ్మ భర్తకోసం ఊరంతా వెతికింది.
తెల్లారేసరికి ఊరి బయట చెరువు దగ్గర చింత చెట్టుకు శవమై వేలాడుతుండు రాజలింగం. వీరమ్మ ఏడ్చి ఏడ్చి నెత్తికొట్టుకుంటూ, మట్టినెత్తిపోస్తూ శాపనార్ధాలు పెట్టింది. ఆమె ప్రమేయం లేకుండానే బంధువులు రివాజు ప్రకారం అంత్యక్రియలు జరిపించారు.
ననన
తల్లి పిలిచినా పిలువకున్నా బతుకమ్మ పండుగకు ఇంటికి పోయి రావాలని శోభ ఏనాటినుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. రమేష్ తనకు కుదరదంటూ శోభను బస్సెక్కించాడు.
ఆర్నెల్లకే ఊరంతా మారిపోయినట్లనిపించింది శోభ కళ్ళకు. దార్లో కనబడ్డ వారిని పలకరిస్తూ ఇంటికి చేరింది. ఎదురచ్చిన తల్లి బిడ్డను హత్తుకొని కన్నీళ్ళు పెట్టుకుంది.
అప్పటికే ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్న మనిషిని చూసి హతాశురాలైంది శోభ. పక్కనే పెద్దబాలశిక్ష. గుండె వేగమందుకుంది. చేయి కడుక్కొని బాగున్నావా కోడలా అని కొత్త వరసతో పలకరిస్తూ బయటికెళ్ళాడు శంకరన్న. కొద్ది సేపటికి కోలుకున్న శోభ తల్లిమీదకి లంఖించుకుంది.
ముఖంలో ఎలాంటి భయం, బాధ లేకుండా తల్లి తన మాటల్ని ఇంత శాంతంగా వినడంతో శోభకు ఇంక ఏం చేయాలో తోచలేదు.
కూతురుకు ఏనాడూ చెప్పవలసిన అవసరం రాని విషయాల్ని ఇప్పుడు చెప్పక తప్పడం లేదు వీరమ్మకు.
''బిడ్డా... మీ నాయిన చచ్చిపోయే నాటికి నేను మూన్నెళ్ళ గర్భవతిని. దహనం అయిన తెల్లారే శంకరన్న మనింటికి వచ్చిండు. నూనూగు మీసాల పిల్లగాడప్పుడు. 'రాజలింగం పాటలంటే నాకు ప్రాణం. ఆయన చనిపోయాడని తెలిసి కలువడానికి వచ్చిన... నీకెవరున్నా లేకున్నా తమ్మునోలె తోడుంట'నన్నాడు. మీ నాయన దినాలు దగ్గరుండి చేసిండు. తర్వాత నన్ను ఇంటికి తీసికెళ్ళిండు. అక్కడే నువ్వు పుట్టినవు. శంకరన్న అసలు పేరు సంపత్ కుమార్. ఇంజనీరు సదువు చదివిండట. తల్లిదండ్రి ఇద్దరూ టీచర్లే. నన్నెంతో ఆప్యాయంగా చూసుకున్నరు. నా బలవంతంమీదే మళ్ళీ ఇంటికి వచ్చిన. వచ్చేదాకా తెలియదు కూలిపోయిన ఇల్లును మళ్ళీ కట్టించిన సంగతి. నీకు ఇదంతా చెప్పద్దన్నాడు కాబట్టే అట్లనే కాలం గడిపిన. చాన్నాళ్ళ తర్వాత నన్ను చూడడానికే ఇంటికచ్చిండు. అయితే నువ్వు ఇప్పుడు ఆయనెవరో ఏం చేస్తడో చెప్పినా భయమనిపిస్తలేదు. నా కష్టాలు మోసినోన్ని నేను దూరం చేసుకోలేను. ఇంతదూరం వచ్చిన బతుకు ఎట్ల కట్టెల్ల కలిసినా సుఖమే'' అంటూ వీరమ్మ శోభకు కొత్త విషయాలెన్నో చెప్పసాగింది.
ననన
బతుకమ్మ పేర్చుతున్నా, ఆడుతున్నా తల్లి, భర్త, శంకరన్నలే శోభ మనసులో మెదులుతున్నరు. ఈ ముగ్గురిలో లేని భయం తనలో ఎందుకుందో అర్ధమయితలేదు. కష్టాలు చూసిన తల్లి, గ్రంథాలు తిరగేసిన శంకరన్న, నింపాదిగా తన పాత్ర పోషించే భర్త... వీరి ముఖాల్లో ఎలాంటి ఆందోళనా లేకుండా ఇంత ప్రశాంతత ఎలా సాధ్యం... ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది శోభ మనసు. వీలయినంత తొందరగా తమ ఇంటికి వెళ్ళి భర్తతో ఈ చిక్కుముడులన్నీ చెప్పాలనే ఆత్రుతతో పండుగ మర్నాడే బట్టలు సర్దుకుంది.
బస్సు దిగి ఇంటికొస్తూ, దార్లోనే నీకోటి చెప్పాలె అంటూ మాట్లాడబోయిన శోభను వారిస్తూ రమేష్ అంతా తెలిసినట్లుగా ఇంటికి వెల్దాం ముందు అని సైకిల్ మోటర్ వేగం పెంచాడు.
ఇంటికి చేరగానే శోభ చెప్పిందంతా ప్రశాంతంగా విని రమేష్ - ''శోభా! ఆయుధం పట్టిన ప్రతివాడూ హంతకుడు కాదు, నేరస్థుడు కాదు. ఊర్లల్ల ఎన్నో మార్పులు రావడానికి శంకరన్నయ్యే కారణం. ఆయనను అడ్డు తొలగించుకోవడానికి ఎందరో ఎదురు చూస్తుంటరు. ఆయనకు పెద్దబాలశిక్షే రక్ష. పేదోడికి మంచి జరుగుడే నాయ్యమైతే మనం న్యాయం వైపే ఉన్నట్లు'' అంటూ ఆగి, ఔనా కాదా అన్నట్లు శోభ గదువ పట్టుకొని కళ్ళతో అడుగుతుంటే రమేష్ను గట్టిగా పట్టుకొని ఆయన ఒడిలో తల దాచుకుంది నీవెంటే నేను అన్నట్లు.
రచయిత సెల్ : 9440128169
మొట్టమొదటి స్టెత్ స్కోప్?
పందొమ్మిదవ శతాబ్దంలో డాక్టర్లు చెవి ఆనించి గుండెచప్పుడు వింటూ హద్రోగాలను నిర్ణయించేవారు. ఫ్రెంచి ఫిజీషియన్ రెన్ లీనెక్ ఓ సమస్యని ఎదుర్కొన్నాడు. ఒకనాడు ఓ అమ్మాయి లీనెక్ దగ్గరికి వచ్చి తన జబ్బు గురించి చెప్పింది. లక్షణాలను బట్టి హద్రోగంగా అనిపించడంతో ఆమె హృదయ స్పందన వినడానికి బిడియపడి, ఆమె గుండెచప్పుడు తెలుసుకోడానికి న్యూస్ పేపర్ని గుండ్రంగా చుట్టి ఆమె గుండెపైన వుంచి రెండో రంధ్రం దగ్గర చెవి వుంచి విన్నాడు. అలా చేయడం వల్ల మామూలు కంటే చాలా స్పష్టంగా గుండె చప్పుడు వినిపించింది. అంతే! ముప్పై సెంటీమీటర్ల పొడవు ఉన్న ఓ వెదురుబొంగుని గొట్టంలా తయారుచేశాడు. అలా స్టెత్ స్కోప్ పుట్టుకకి కారణమయ్యాడు.
- బి.నర్సన్
Sat 04 Feb 14:35:34.834827 2017