Sat 27 Aug 17:37:16.99093 2016
Authorization
రామశేషు ఎడమ చేతిలో హైస్కూల్లో చదివే పిల్లలు పరీక్షలకు వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్ళే అట్ట వుంది. దాని క్లిప్పుకు తెల్లకాయితం కూడా వుంది. అతని కుడి చేతిలో బాల్పాయింటు పెన్నువుంది. రామశేషు డియర్ రామస్వామీ అంటూ ఎక్కడో దూరంగా పల్లెటూరిలో వున్న తన చిన్ననాటి స్నేహితుడికి ఉత్తరం రాయాలని కూర్చున్నాడు. కానీ ఆయన ఉత్తరాన్ని మొదలు పెట్టకముందే ఎన్నో సందేహలు వచ్చాయి. ఇంతకీ రామస్వామి ఆ పల్లెటూర్లోనే వున్నాడా? ఊరు మారాడా? ఆరోగ్యంగా వున్నాడా? తాను దాదాపు యాభైయేళ్ల తర్వాత రాస్తున్న ఈ ఉత్తరాన్ని చదువుకుంటాడా? చదువుకున్నా తనని గుర్తుపడతాడా? ఇంకా తను రామస్వామికి గుర్తున్నాడా? యాభైయేళ్ళ కాలమంటే మాటలుకాదు. సులభంగా మరిచిపోయే అవకాశం వుంది.
ఇలా ఎన్నో సందేహాలు తన స్నేహితుడు తనని మరచిపోయి వుండడనే ఆశ. ఒక వైపు మరిచిపోయి వుంటాడేమోననే నిరాశ, రామశేషు ఇలా తర్జన భర్జనలు పడి ఆ ఉత్తరాన్ని రాయటానికే నిశ్చయించుకున్నాడు. తన ప్రయత్నం తను చెయ్యాలి. యాభైయేళ్ళు గడిచినా రామస్వామిని తను గుర్తుపెట్టుకోలా? అలాంటప్పుడు రామస్వామి మటుకు తనని ఎందుకు మరచిపోతాడు? రామస్వామి తనకు మంచి స్నేహితుడు. ఇద్దరి మధ్యనా స్నేహానికి సంబంధించి ఎన్నో సంఘటనలు, వాటి తాలూకు మధురమయిన అనుభూతులూ వున్నాయి. రామస్వామి తనని ఎన్నటికీ మరచిపోడు. రామశేషుకు నమ్మకం కలిగింది. ఉత్తరాన్ని కొనసాగించాడు.
డియర్ రామస్వామీ అంటూ ఉత్తరాన్ని ప్రారంభించాడు.
నేను ఇంకా నీకు గుర్తున్నానా? నేను రామశేషును. శేషూ అని ప్రేమగా పిలిచేవాడివి. మీ ఇంటి వరసలోనే రామమందిరం పక్క ఇంట్లో వుండేవాళ్ళం. మానాన్న ఆయుర్వేద వైద్యం చేసేవాడు. నీకు గుర్తుందా? ఒకరోజు రాత్రి నీకు కడుపులో నొప్పి వచ్చిందని మీ అమ్మ నిన్ను మా నాన్న దగ్గరకు తీసుకు వచ్చింది మందుకోసం. అప్పుడు మానాన్న ఇచ్చిన మందు చేదుగా వుందని నువ్వు తాగనన్నావు, మీ అమ్మ రెండు దెబ్బలు వేసి నీచేత ఆ మందును తాగించింది. ఆ రాత్రి మా నాన్న ఇచ్చిన మందుతో నీ కడుపునొప్పి తగ్గింది. ఆ మర్నాడు నువ్వు నేను మన వూరి హైస్కూల్లో ఎనిమిదో క్లాసులో చేరాము. ఒకే బెంచీలో కూర్చున్నాము. ఆ రోజంతా చేదుమందు ఇచ్చినందుకు నువ్వు మా నాన్నను తిడుతూనే వున్నావు, ఈ సారి మళ్ళీ కడుపులో నొప్పి వస్తే మానాన్న దగ్గర మందు తీసుకోనని చెప్పావు. నవ్వి వూరుకున్నాడు. మీకు వ్యవసాయం వుంది. ఎద్దులూ, బండీ వున్నాయి. నీకు అన్నయ్య వున్నాడు. లావుగా పొడుగ్గా వుండేవాడు. ఇప్పుడు ఎలా వున్నాడు? మీ అమ్మా నాన్నా బాగున్నారా! నాకు నవ్వొస్తోంది. మనకే అరవై యేళ్ళు దాటుతున్నాయి. ఇంకా మన తల్లిదండ్రులు బతికి వుండే అవకాశం వుందా? ఉంటే అడిగానని చెప్పు.
రామశేషు ఏడవతరగతి పూర్తిచేసేసరికి అతడి తండ్రి అంతకు ముందున్న పల్లెటూరి నించి మకాం మార్చవలసి వచ్చింది. ఎందుకంటే ఆ వూరికి ఓ ఇంగ్లీషు వైద్యం చేసే డాక్టరు వచ్చాడు. పైగా ఆ వూరివాడేనట, జనమంతా ఇంగ్లీషు డాక్టరు దగ్గరకు వెళ్లడం మొదలు పెట్టారు. రామశేషు తండ్రిని ఎవరూ పట్టించుకోలేదు. ఇల్లు గడవడం కష్టమయ్యింది. అందువల్ల రామశేషు ఎనిమిదో క్లాసు ఆ ఊరి హైస్కూల్లో చేరాల్సి వచ్చింది. అప్పుడు రామశేషు రామస్వామి స్నేహితులయ్యారు.
ఆ ఊళ్ళో స్కూలుకు దగ్గరగా రైసుమిల్లు వుంది. ఆ రైసు మిల్లు ముందు పెద్దనేరేడు చెట్టు వుంది. ఆ యేడు ఆ నేరేడు చెట్టుకు కాయలు విరగకాశాయి. స్కూల్లో ఉదయం, సాయంత్రం ఇంటర్వెల్ కొట్టగానే అంతా బయటకు వచ్చి రోడ్డుమీద ఆటలాడేవాళ్ళు.
రామస్వామి, రామశేషు మాత్రం రోడ్డు మీద ఆడకుండా రైసుమిల్లు ముందుకు వచ్చి ఆడుకునే వాళ్ళు. ముందుగా రామశేషు నేరేడు పండ్లను చూసి వాటిని రాళ్ళతో కొడదామన్నాడు. రామస్వామి వొప్పుకొలేదు. రాళ్ళు ఎవరికయినా తగులుతాయని వద్దన్నాడు. కానీ రామశేషు వినలేదు. చివరకు మిత్రుడి మాట వినక తప్పలేదు. ఒక షరతుమీద వొప్పుకున్నాడు. రామశేషు రాళ్ళతో పండ్లను కొట్టడం, కిందపడిన పండ్లను రామస్వామి యేరే విధంగా వొప్పందం కుదిరింది.
రామశేషు రాళ్ళను విసురుతున్నాడు చెట్టు మీదకు. కిందపడిన నేరేడు పండ్లను రామస్వామి యేరుతున్నాడు. కంకర రోడ్డు మీద రాళ్లు బాగా దొరుకుతున్నాయి. రామశేషుకు సంతోషంగా వుంది. నేరేడు పండ్లు బాగా రాలుతున్నాయి. అప్పటికే రెండు జేబులు నిండాయి.
స్కూలు బెల్లు కొడతారనే తొందరలో రామశేషు రాళ్ళను గబగబా విసురుతున్నాడు. అలా విసరడంలో పైకి విసిరిన ఒకరాయి వేగంగా వచ్చి రొడ్డు మీద వెళుతున్న పదేళ్లున్న అమ్మాయి తలకు తగిలింది. ఆ అమ్మాయి పెద్దగా అరిచి కిందపడింది. తల మీదనించి నెత్తురు.
పక్కనే ఆ అమ్మాయి తల్లి కూడా వుంది. ఆ తల్లి వీళ్ళిద్దర్నీ చూడనే చూసింది. వాళ్ళకోసం పరుగుతీసి కూతురి దగ్గర ఆగిపోయింది.
రామశేషు, రామస్వామి భయంతో స్కూలు వైపు పరుగుదీశారు. స్కూల్లో వుంటే పట్టుకుంటారని పుస్తకాల సంచీలను స్కూల్లోనే వదిలి ఇంటికి వెళ్ళిపోయారు.
మధ్యాహ్నం స్కూలుకు వెళ్ళలేదు. స్నేహితులు వాళ్ళ పుస్తకాల సంచీలను ఇంటికి తీసుకువచ్చి ఇచ్చారు. విషయం తెలిసి ఇంట్లో తండ్రి చేత తన్నులు.
రామశేషు గుర్తుచేసుకొని మరీ ఈ సంఘటన గురించి రామస్వామికి రాశాడు. ఈ సంఘటనను ఎందును రాశాడంటే ఇది గుర్తుకు వస్తే తను తప్పకుండా గుర్తుకు వస్తాడు. అంత సులభంగా మరచిపోయే సంఘటన కాదు అది.
ఆ తర్వాత డ్రాయింగు క్లాసులో జరిగిన సంఘటన గురించి కూడా రాశాడు. అదేమిటంటే.... డ్రాయింగ్ క్లాసు జరుగుతోంది. డ్రాయింగ్ మాస్టరు బోర్డుమీద మందార ఆకు బొమ్మను గీస్తున్నాడు. పిల్లలంతా చూస్తున్నారు.
రామశేషు జేబులలో లావుపాటి పెన్ను వుంది. అది ఇంకు పోసి రాసే పెన్ను. అప్పట్లో బాల్ పాయింట్ పెన్నులు లేవు. పక్కనేవున్న రామస్వామితో అన్నాడు - ఆ పెన్నులోవున్న సిరాను తాగుతానని. అప్పడు రామస్వామి అలా చెయ్యవద్దనీ, ఇంకు తాగితే చనిపోతారనీ అన్నాడు. ఇద్దరికీ ఈ విషయం మీద వాదన జరిగింది. ఇంకు తాగితే చనిపోరాని రామశేషు వాదించాడు. చనిపోతారని రామస్వామి అన్నాడు. కావాలంటే చూడు అని రామశేషు కలానికి వున్న స్క్రూ తీసి ఇంకునంతా నోట్లోకి వంచుకుని తాగాడు. నోరంతా నీలంగా మారిపోయింది. డ్రాయింగ్ మాస్టరు కుమారస్వామి ఇదంతా గమనించి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఇంకు గురించి అడిగితే రామస్వామి జరిగినదంతా ఆయనకు చెప్పాడు. ఆయన కోపంతో రామశేషును వంగదీసి వీపుమీద కొట్టి వెళ్ళి పోయాడు. తనని కొట్టించినందుకు రామస్వామితో రెండు రోజులు రామశేషు మాట్లాడలేదు.
ఈ సంఘటన గురించి కూడా రామశేషు ఉత్తరంలో రాశాడు. ఇవే కాకుండా ఇంకా కొన్ని ముఖ్యమయిన సంఘటనల గురించి కూడా రాశాడు.
తర్వాత ఎక్కడెక్కడ ఎటువంటి ఉద్యోగాలు చేశాడో, ఎలాంటి జీవితాన్ని గడిపాడో, తన కుటుంబం గురించీ, పిల్లల గురించీ విపులంగా రాశాడు. తనకు రామస్వామి ఎప్పుడూ గుర్తుకు వస్తూ వుంటాడనీ, కానీ రామస్వామి గురించి ఆచూకీ తెలియని కారణంగా కలవలేక పోయాననీ, ఇప్పుడయినా ధైర్యం చేసి ఆఖరి ప్రయత్నంగా ఈ ఉత్తరం రాస్తున్నాననీ, ఉత్తరం చేరగానే జావాబు రాయమనీ తన అడ్రసును రాశాడు.
రామశేషుకు కొన్ని రోజుల నించీ ఎందువల్లనో రోజూ రామస్వామి గుర్తుకు రావటం మొదలుపెట్టాడు. ఒకసారి రామస్వామిని కలవాలనీ, రామస్వామితో మాట్లాడాలనీ తీవ్రంగా అనిపించింది. ముందు అతడు ఎక్కడ వున్నాడో తెలుసుకోవాలి. అందుకే ముందుగా అతని స్వంత పల్లెటూరికి ఉత్తరం రాయాలని అనుకున్నాడు.
ఉత్తరం రాసి, కాయితాన్ని కవర్లో వుంచి, కవర్ని అంటించిన తర్వాత తృప్తిగా అనిపించింది. తప్పకుండా ఆ ఉత్తరం రామస్వామికి చేరుతుంది. రామస్వామి తనకు జవాబు రాస్తాడు. తర్వాత తాను రామస్వామిని కలుస్తాడు. తనివితీరా మాట్లాడుకుంటారు ఇద్దరూ.
ఇలా అనుకొని ఆ రాత్రి కంటినిండా నిద్ర పోయాడు రామశేషు.
తను రాసిన ఆ ఉత్తరం సకాలంలో చేరితే వారంరోజుల లోపల రామస్వామి నుండి తనకు జవాబు వస్తుంది. రామస్వామి తాత్సారం చేసే మనిషి కాదు. ఉత్తరాన్ని పోస్టు డబ్బాలో వేసిన మార్నాటినించీ రామశేషు జవాబు కోసం ఎదురు చూడడం ఆరంభించాడు.
తొమ్మిదిరోజులు గడిచాయి. రామశేషులో ఆశ అడుగంటింది. తన ఉత్తరం రామశేషుకు చేరలేదేమో అనుకున్నాడు. ఇంకో ఉత్తరం రాయాలని అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా పదవరోజు రామశేషు పేరుతో ఓ ఉత్తరం వచ్చింది.
రామశేషు ఆత్రంగా కవర్ని చించి గబగబా చదివాడు. అందులో ఇలా వుంది -
రామశేషు తాతగారికి
నమస్కారం. నాపేరు నీరజ. రామస్వామిగారి మనవరాలిని. మెడిసిన్ చదువుతున్నాను. మీరు ఎంతో ప్రేమగా మీ మిత్రుడికి రాసిన ఆ ఉత్తరాన్ని నేను చదివాను. ఇంకొకరి ఉత్తరాలు చదవకూడదని తెలిసినా చదవక తప్పలేదు. ఎందుకంటే మీరు రాసిన ఆ ఉత్తరాన్ని చదవాల్సిన మా తాతయ్య ప్రస్తుతం జీవించిలేడు కాబట్టి. ఆయన నాలుగేళ్ళ క్రితం గుండెజబ్బుతో చనిపోయారు. ఆయనకు మీరు బాగానే గుర్తున్నారు. ఆయన ఎప్పుడూ మీ గురించే మాట్లడేవారు. ఇప్పుడు మీరు ఉత్తరంలో రాసిన సంఘటనల గురించి ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. మీ గురించి, ఆ సంఘటనల గురించి చెప్పేటప్పుడు ఆయన కళ్ళు మెరిసేవి. ఆ మెరుపును బట్టి వాటి పట్ల ఆయనకు వున్న ఇష్టం వ్యక్తమయ్యేది. ఆయన జీవించి వుంటే మీ ఉత్తరాన్ని చూసి చాలా సంతోషపడేవారు. రెక్కలు కట్టుకుని మీ ముందు వాలేవారు. దురదృష్టం... ఆయన పోయినందుకు బాధపడకండి. మన స్మృతుల్లో ఆయన ఎప్పుడూ జీవించే వుంటాడు. ఏ మనిషికయినా భావన ముఖ్యం. ఆయన పోయాడని రాయకుండా వున్నట్లయితే మీ మిత్రుడు ఇంకా సజీవంగానే వున్నాడనే భావనలో మీరు వుండే వాళ్ళేమో! కానీ మంచి మిత్రుడి మరణవార్తను మీకు తెలియజేయకపోవడం న్యాయం కాదుగదా! అందుకే రాశాను.
మా తాతయ్యకు స్నేహితులయిన మిమ్మల్ని చూడలని వుంది. ఒకసారి ఊరు రండి. ఒకప్పుడు మీరు వున్న ఊరిని చూసినట్టు వుంటుంది. సారీ. అలా చెయ్యకండి. మా తాతగారి వయసున్న మిమ్మల్ని శ్రమతీసుకొని ఇంతదూరం రమ్మని కోరటం భావ్యంకాదు. త్వరలో నేనే అక్కడకు వస్తాను. మిమ్మల్ని చూసి మీ ఆశీస్సులందుకుంటాను. మీరు కూడా నాకు తాతగారే. ఇక సెలవు తీసుకుంటాను.
మీ మనవరాలు
- నీరజ
రచయిత సెల్ : 8897775291