Sat 16 Jan 16:16:15.398056 2016
Authorization
కొన్ని విషయాల్లో మెజారిటీ జనం ఆలోచనల ఆకర్షణ ఒకేలా ఉంటాయి. హోటల్ హాలులో ఫంక్షన్ చేసుకుంటే హాలుకి అద్దె ఫ్రీ. వాళ్లు పెట్టే భోజనానికి మాత్రమే డబ్బు తీసుకుంటారు. హాలు అద్దె ఆ భోజనాల ఖర్చులోనే కలిసి ఉంటుందని తెలుసు. అయినా అదోరకం భ్రమ. రమ్య, వినోద్ కూడా తమ కూతురి మూడో సంవత్సరం పుట్టిన రోజుకి అలాంటి భ్రమకే లొంగిపోయారు. పెద్ద హోటల్ అని ముందు సందేహించినా చివరికి అక్కడే ఏర్పాటు చేశారు.
ఒక్కగానొక్క పిల్ల. జనం లేకపోతే బావుండదని పేరు పేరునా గుర్తు తెచ్చుకుని మరీ అ ందరినీ పిలిచారు.
పుట్టిన రోజు పండగ మంచి హడావుడిగా, సందడిగా, ఆనందంగా గడిచింది. వీలున్నవాళ్ళే వస్తారు... పిలిచిన అందరూ రారు కదా అనుకున్నారు. కానీ వీళ్ళు అనుకున్న వాళ్ళ కన్నా దరిదాపు రెట్టింపు వచ్చారు.
డెకరేషన్కి, భోజనానికి, వీడియోలకి వీళ్ళు అనుకున్నది నలభైవేలు. కానీ చివరికి తేలిన ఖర్చు డెభ్బై వేల పైన. భార్యాభర్తా ఇద్దరూ శ్రమపడి యాడాది ఆపటు పొదుపు చేసి దాచిన డబ్బు అది. పైకి చెప్పుకోలేకపోయినా, తాము ఉద్యోగాల రకరకాల ఒత్తిడి అనుభవించి చేసిన పొదుపు. ఏదో ఓ పెనుగాలికి కొట్టుకుపోయినట్టే ఉంది ఆ ఇద్దరికీ. మళ్ళీ రూపాయి రూపాయికి బెంగపడే పొదుపు జీవితమే.
ఆటో ఫైనాన్స్ వాళ్ళ దగ్గర లోన్ తీరిపోయినందుకు అంతా ఇంతా ఆనందం కాదు బాలరాజ్కి. ఇంక రోజా సంపాదించేదంతా తనదేనన్న ధీమా.
కష్టపడుతున్నా ఆనందంగా ఉంది. అప్పులేని సుఖం ఎంత బావుందీ అనుకున్నాడు ఆ వారమంతా బాలరాజ్. అతని ఆనందం అలా మిగల్లేదు. మరుసటి రోజు పిల్లలిద్దరూ పుట్టెడు జ్వరంతో నిద్రలేచారు. హడావిడిగా హాస్పటల్కి తీసికెళ్ళారు. మూడు రోజులు వైద్యం జరిగినా జ్వరాలు తగ్గలేదు. చుట్టూ ఉన్నవాళ్ళు రకరకాల భయాలు పెట్టి, అశ్రద్ధ చేయకుండా పెద్ద హాస్పటల్కి తీసికెళ్ళమన్నారు. అలాగే చేశాడు. నాలుగు రోజులు రకరకాల పరీక్షలు చేసి చివరికి వైరల్ ఫీవర్ అన్నారు.
బాల్రాజ్ మళ్ళీ తనకున్న ఏకైక మార్గం ఫైనాన్స్ వాళ్ళ దగ్గర అప్పు చేశాడు. మామూలు వైరల్ ఫీవర్కి ముప్పై వేలైంది. ఆ అప్పు తీర్చడానికి బాలరాజ్కి రెండేళ్ళు పడుతుంది. మళ్ళీ మామూలుగా అప్పు దిగుల్లో కూరుకుపోయాడు.
ఆ కార్పొరేట్ స్కూల్ వాళ్ళు పెట్టిన పరీక్షలన్నీ నెగ్గి, వెంకట్రావు దంపతులు తమ పిల్లాణ్ణి ఎల్.కె.జి.లో విజయవంతంగా చేర్చారు. యూనిఫారం తదితర సరంజామా కొన్నారు. ట్రాన్స్పోర్ట్కి డబ్బు కట్టారు. అన్నీ చేరి తొంభైవేలు దాటింది.
ఒక్క పిల్లాడే కదా పర్వాలేదనుకున్నారు. అయినా తొంభైవేల బరువు తెలుస్తూనే ఉంది. ఇప్పుడే ఇలా అయితే, పై చదువులు ఇంకెలాగో అనిపించింది. బలవంతంగా ఆ దిగుల్ని వాయిదా వేసుకున్నారు.
గతంలో... అంటే యాభై, అరవై ఏళ్ళక్రితం పిల్లలు పుట్టిన రోజులు, జ్వరాలు వస్తే వైద్యం, స్కూల్లో చేర్పించి చదువులు చెప్పించడం చాలామంది చేశారు. ఎందరో వాటిని చూశారు.
అప్పుడవి అంత పెద్ద బరువనిపించేవి కావు. వాటికోసం ఖర్చు చేసినా ఆ ఖర్చు మరీ ఇంత దిగలాగేసేది కాదు. పిల్లల పెంపకం ఓ ఆనందంలా, ఓ జీవన సౌరభంలా ఉండేది. కష్టాలైనా, సుఖాలైనా, బతుకులో సహజంగా ఎదురైనట్టే ఉండేవి.
ఇప్పుడలా కాదు. పిల్లల్ని సరిగ్గా పెంచలేమన్న బెదురు. వాళ్ళ పెంపకం ఓ బరువులా, భయంలా మారుతున్న అమానుషం. అవసరాలు అప్పుడు... ఇప్పుడూ అవే. కానీ భారంలోనే తేడా. కృత్రిమ భారం.
ఇన్నేళ్ళుగా చాపకింద నీరులా, ఎందరెందరో స్వార్థ వ్యాపార మేధావులు సృష్టించి, జన సామాన్యం మీద దట్టంగా పరిచిన మాయ. జీవితంలోని రుచిని పిండేస్తున్న మాయ. అందరూ అదే చేస్తున్నారు, మనం అలాగే చెయ్యాలన్నా మూకుమ్మడి ఆలోచన. దానికి భిన్నంగా ఆలోచనే తట్టనివ్వని మాయ.
రమ్య, వినోద్, బాలరాజ్, వెంకట్రావు దంపతులు, మరొకరు, మరొకరు... అందరూ ఈ సుడిగుండంలో ఉన్నవాళ్ళే. వ్యక్తిపరంగా ఏం చెయ్యలేం అనిపించే సుడిగుండం. అందీ అందని ఊపిరిలాంటి జీవితం.
ఏది ఏమైనా, దోషం ఎవరిదైనా మన పిల్లలు మనకి భారం అనిపించేలా పరిస్థితిని సృష్టించిన ఈ మాయ మహాఘోరం.
- వి.రాజరామమోహనరావు, 9394738805