హైదరాబాద్ : రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ట్రైబల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టాలని గిరిజన శక్తి డిమాండ్ చేసింది. ఈరోజు గిరిజన శక్తి రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకుల సమావేశం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ చౌహాన్,గౌరవ అధ్యక్షులు రాజేష్ నాయక్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం 2014.. 13వ షెడ్యూల్లో తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన ట్రైబల్ యూనివర్సిటీ వెంటనే ప్రారంభించాలని అన్నారు. ఇప్పటికే ఆరేండ్లు గడిచినా ఏమాత్రం గిరిజన విద్యార్థులపై చిత్తశుద్ధి లేకుండా వారిని చదువుకు దూరం చేసే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేయడం బాధాకరమని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గిరిజన విద్యార్థులు విద్యలో పరిశోధనలో వెనుకబడ్డారు. రాబోయే రోజుల్లో ప్రతి తండాలో, మండల, జిల్లా, స్థాయిలో శక్తి నిర్మాణం చేసి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం గిరిజన హక్కుల సాధనకై మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం రావాల్సిన రిజర్వేషన్ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసారు. గిరిజన పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి శరత్ నాయక్ తెలిపారు. ఈనెల 28న వరంగల్ జిల్లా హోటల్ హరిత కాకతీయ చేసాలో జరగబోయే అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో గిరిజన మేధావులు ఉద్యోగులు విద్యార్థులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ్, పాండు, రాజారాం, బాలాజీ, రాము, జెడి నాయక్, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm