హైదరాబాద్ : చిత్తూరు జిల్లాలో యువతిని కత్తితో పోడిచి చంపిన ప్రేమోన్మాది ఢిల్లీ బాబు(19) ఆత్మహత్య చేసుకున్నాడు. పెనుమూరు మండలం తూర్పుపల్లి అడవిలో ఉరేసుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లెకు చెందిన జి.గాయత్రి (20) చిత్తూరులో, పూతలపట్టు మండలం చింతమాకులపల్లెకు చెందిన ఢిల్లీబాబు (19) పెనుమూరులో డిగ్రీ చదువుతున్నారు. కులాలు వేరు కావడంతో వారిద్దరి పెళ్లీకి పెద్దలు ఒప్పుకోరని భావించి.. గత నెలలో ఇంట్లో నుంచి పారిపోయారు. తిరుపతిలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. తమ కుమార్తె తప్పిపోయిందని యువతి తండ్రి షణ్ముగరెడ్డి ఆ సమయంలో పెనుమూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ప్రేమికుల ఆచూకీని గుర్తించిన పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ చేశారు. గాయత్రి తన తల్లిదండ్రులతోనే ఉండేందుకు అంగీకరించి వెళ్లిపోయింది. అప్పటి నుంచి డిల్లీబాబుకు దూరంగా ఉంటోంది. ప్రేమించిన యువతి తనతో ఉండటం లేదని డిల్లీబాబు కక్ష పెంచుకున్నాడు. ఇంటి సరకుల కోసం గాయత్రి తన బంధువుల అమ్మాయితో కలిసి మంగళవారం ద్విచక్ర వాహనంపై పెనుమూరుకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న డిల్లీబాబు ఆమెను తిరుగు ప్రయాణంలో ఎంప్రాళ్లకొత్తూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో అడ్డుకున్నాడు. వెంట తెచ్చుకున్న చిన్నపాటి చాకుతో మొదట గొంతుపై పొడిచాడు. మరో కత్తితో విచక్షణారహితంగా కడుపులో 10 సార్లు పొడిచి చంపేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm