హైదరాబాద్: కుమురంభీం జిల్లాలో పులి మరోమారు పంజా విసిరింది. పొలంలో పత్తి ఏరుతున్న బాలికను తల్లి, సోదరుడు, కూలీలు చూస్తుండగానే ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన కుమురంభీం జిల్లాలోని పెంచికల్పేట మండలం కొండపల్లి శివారులో జరిగింది. ఈ నెల 11న విఘ్నేశ్ అనే 19 ఏళ్ల యువకుడిని చంపేసిన పులి.. తాజాగా నిన్న ఓ బాలిక ప్రాణాలు తీసింది. కొండపల్లి శివారులో ఓ రైతు పొలంలో పత్తి ఏరేందుకు కూలీలుగా నిర్మల(16), ఆమె సోదరుడు రాజేశ్, తల్లి లక్ష్మక్క, మరి కొందరు వెళ్లారు. మధ్యాహ్నం వరకు పత్తి ఏరిన వారిలో కొందరు భోజనానికి కూర్చోగా, నిర్మల, మరో స్నేహితురాలితో కలిసి పొలానికి మరో వైపుకు పత్తి ఏరుతోంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి వారిపై దాడిచేసిన పులి నిర్మలను నోట కరుచుకుని వెళ్లిపోయింది. నిర్మల అరుపులు విని అప్రమత్తమైన వారు కర్రలతో వెంబడించడంతో కొద్దిదూరం వెళ్లాక నిర్మలను వదిలిపెట్టి వెళ్లిపోయింది. అప్పటికే తీవ్ర గాయాలైన నిర్మల అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న డీఎఫ్ఓ శాంతారాం ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm